నాలుగో స్థానానికి తగ్గిన హ్యుందాయ్

May 5,2025 22:46 #Business

40 శాతం దిగువకు మారుతి మార్కెట్‌ వాటా
న్యూఢిల్లీ : భారత ఆటోమొబైల్‌ రంగంలో చాలా కాలం రెండో అతిపెద్ద సంస్థగా కొనసాగిన హ్యుందాయ్ మోటార్‌ ఇండియా అనుహ్యాంగా తన మార్కెట్‌ వాటాను కోల్పోయింది. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమోటివ్‌ డీలర్స్‌ ఆసోసియేషన్‌ (ఎఫ్‌ఎడిఎ) గణంకాల ప్రకారం.. హ్యుందారు మోటార్స్‌ను అధిగమించి మహీంద్రా అండ్‌ మహీంద్రా రెండో స్థానంలోకి వచ్చింది. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ మార్కెట్‌ వాటా 40 శాతం దిగువకు పడిపోయింది. టాటా మోటార్స్‌ మాత్రం యథాతథంగా మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో దేశీయంగా 3.49 లక్షల పాసింజర్‌ వాహనాలు విక్రయాలు నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో 3.44 లక్షల వాహన విక్రయాలతో పోలిస్తే 1.55 శాతం పెరుగుదల ఉంది. కాగా.. మారుతీ సుజుకీ గడిచిన ఏప్రిల్‌లో 1,38,021 యూనిట్లను విక్రయించి 39.44 శాతం మార్కెట్‌ వాటాకు పరిమితమయ్యింది. గతేడాది ఇదే నెలలో 40.39 మార్కెట్‌ వాటాను కలిగి ఉంది. మరోవైపు మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) వేగంగా రెండో స్థానంలోకి వచ్చింది. ఈ సంస్థ ఏప్రిల్‌లో 48,405 వాహనాలు విక్రయించి 13.83 శాతం మార్కెట్‌ వాటాను సాధించి.. రెండో స్థానంలో నిలిచింది. ఇంతకాలం రెండో స్థానంలో ఉన్న హ్యుందారు ఏప్రిల్‌లో 43,642 యూనిట్ల అమ్మకాలతో 12.47 శాతం మార్కెట్‌ వాటాతో నాలుగో స్థానానికి పరిమితమైంది. గతేడాది ఇదే సమయంలో 14.29 శాతం వాటాను కలిగి ఉంది. టాటా మోటార్స్‌ ఏప్రిల్‌లో 44,065 యూనిట్ల అమ్మకాలతో 12.59 శాతం మార్కెట్‌ వాటాతో మూడో స్థానంలో నిలిచింది. గతేడాది ఇదే నెలలో 46,915 యూనిట్లను విక్రయించి 13.61 శాతం మార్కెట్‌ వాటాను నమోదు చేసింది.

➡️