ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లకు స్వల్ప ఉపశమనం లభించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల నేపథ్యంలో మంగళవారం బిఎస్ఇ సెన్సెక్స్ 234.12 పాయింట్లు లేదా 0.30 శాతం పెరిగి 78,199కి చేరింది. ఇంట్రాడేలో 78,452-77,925 మధ్య కదలాడింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 23,707 వద్ద ముగిసింది. సోమవారం సెషన్లో సెన్సెక్స్ 1258 పాయింట్లు, నిఫ్టీ 389 పాయింట్ల చొప్పున పతనం అయ్యాయి. ఈ భారీ నష్టాల నుంచి మదుపర్లకు కాస్త ఊరట లభించినట్లయ్యింది.