79 శాతం తగ్గిన ఎంఎఫ్‌ పెట్టుబడులు

న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది జనవరితో పోల్చితే గడిచిన ఫిబ్రవరిలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల్లో ఏకంగా 79 శాతం పతనం చోటు చేసుకుంది. ఈక్విటీ ఎంఎఫ్‌లు 26 శాతం తగ్గి రూ.29,303 కోట్లకు పరిమితమయ్యాయి. జనవరిలో ఈ మొత్తం రూ.39,687 కోట్లుగా నమోదయ్యిందని అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (ఎఎంఎఫ్‌ఐ) వెల్లడించింది. డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో జనవరిలో అత్యధికంగా రూ.1.28 లక్షల కోట్ల పెట్టుబడులు నమోదు కాగా.. ఫిబ్రవరిలో రూ.6,525 కోట్ల మేర పెట్టుబడులు తరలిపోయాయి. స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు 35 శాతం తగ్గాయి. జనవరిలో రూ.5,720 కోట్లుగా ఉన్న ఈ మొత్తం ఫిబ్రవరిలో రూ.3,722 కోట్లకు చేరింది. మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లోనూ 34 శాతం క్షీణతతో రూ.3,406 కోట్లకు తగ్గాయి. ఇంతక్రితం నెలలో రూ.5,147 కోట్ల పెట్టుబడులు చోటు చేసుకున్నాయి. మ్యూచుఫల్‌ ఫండ్స్‌ ఇండిస్టీ పరిధిలో ఉన్న నికర ఆస్తుల నిర్వహణ 4 శాతం క్షీణించి రూ.64.26 లక్షల కోట్లకు చేరింది. గడిచిన ఫిబ్రవరి సిప్‌ల్లోనూ పెట్టుబడులు 2 శాతం తగ్గి రూ.26,400 కోట్లుగా చోటు చేసుకున్నాయి.

➡️