పిఎన్‌బి ఫలితాలు ఆకర్షణీయం

  • క్యూ4 నికర లాభాల్లో 51 శాతం వృద్ధి
  • తగ్గిన మొండి బాకీలు
  • డివిడెండ్‌కు బోర్డు ఆమోదం

హైదరాబాద్‌ : ప్రభుత్వ రంగంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పిఎన్‌బి) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ.4,567 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలోని రూ.3,010.27 కోట్ల లాభాలతో పోల్చితే ఏకంగా 51.7 శాతం వృద్ధి నమోదయ్యింది. గడిచిన క్యూ4లో పిఎన్‌బి నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) 3.8 శాతం పెరిగి 10,756.98 కోట్లుగా చోటు చేసుకుంది. 2024-25కు గాను రూ.2 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్‌పై రూ.2.90 లేదా 145 శాతం డివిడెండ్‌ చెల్లించడానికి పిఎన్‌బి బోర్డు ఆమోదం తెలిపింది. దీనికి వార్షిక సాధారణ సమావేశం (ఎజిఎం)లో వాటాదారుల అనుమతి లభించాల్సి ఉంటుంది. అదే విధంగా బేసల్‌ 111లో కంప్లయంట్‌ బాండ్స్‌ను జారీ చేయడం ద్వారా రూ.8,000 కోట్లు సమీకరించడానికి పిఎన్‌బి బోర్డు ఆమోదం తెలిపింది.
2025 మార్చి నాటికి బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు (జిఎన్‌పిఎ) 178 బేసిస్‌ పాయింట్లు మెరుగుపడి 3.95 శాతానికి తగ్గాయి. 2024 ఇదే మార్చి నాటికి 5.73 శాతం జిఎన్‌పిఎ చోటు చేసుకుంది. నికర నిరర్థక ఆస్తులు 0.73 శాతం నుంచి 0.40 శాతానికి పరిమితమయ్యాయి. గడిచిన క్యూ4లో గ్లోబల్‌ రుణాల జారీ 13.56 శాతం పెరిగి రూ.11,16,637 కోట్లకు చేరాయి. ఇవి 2024 మార్చి నాటికి రూ.9,83,325 కోట్లుగా ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం 2024-25లో మొత్తం నికర లాభాలు రూ.16,630 కోట్లకు పెరిగాయి. ఇంతక్రితం ఏడాదిలో రూ.8,245 కోట్ల లాభాలతో పోల్చితే రెట్టింపు పైగా వృద్ధి సాధించినట్లయ్యింది. ఇదే సమయంలో రూ.1,20,285 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం.. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.1,38,070 కోట్లుగా నమోదయ్యింది.

➡️