- రూ.8.35 శాతం డివిడెండ్కు ఆమోదం
హైదరాబాద్ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో బ్యాంక్ ఆఫ్ బరోడా (బిఒబి) నికర లాభాలు 3 శాతం వృద్ధితో రూ.5,048 కోట్లకు చేరాయి. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ4లో రూ.4,886 కోట్ల లాభాలు నమోదు చేసింది. ప్రభుత్వ రంగంలోని బిఒబి 2024-25కు గాను ప్రతీ ఈక్విటీ షేర్పై రూ.8.35 డివిడెండ్ను ప్రకటించింది. ఇందుకు రికార్డ్ తేదిని 2025 జూన్ 6గా తీసుకుంది. గడిచిన క్యూ4లో బ్యాంక్ వడ్డీ ఆదాయం 3.6 శాతం పెరిగి రూ.29,583.40 కోట్లుగా చోటు చేసుకుంది.
మార్కెట్ కాపిటలైజేషన్ ప్రకారం.. రెండో అతిపెద్ద పిఎస్యు బ్యాంక్ అయినా బిఒబి క్రితం మార్చి త్రైమాసికంలో వడ్డీ వ్యయం 10 శాతం పెరిగి రూ.19,622.39 కోట్లకు చేరింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 2.26 శాతానికి దిగివచ్చాయి. గతేడాది ఇదే త్రైమాసికం నాటికి 2.92 శాతం జిఎన్పిఎ చోటు చేసుకుంది. ఇదే సమయంలో నికర నిరర్ధక ఆస్తులు 0.68 శాతంగా ఉండగా.. గడిచిన మార్చి ముగింపు నాటికి 10 బేసిస్ పాయింట్లు తగ్గి 0.58 శాతంగా నమోదయ్యింది. మొత్తం డిపాజిట్లు 10.3 శాతం పెరిగి రూ.14,72,035 కోట్లకు చేరాయి. గృహ రుణాలు 17.3 శాతం పెరిగి రూ.1,31,123 కోట్లకు చేరగా.. వాహన రుణాలు 20.3 శాతం పెరిగి రూ.46,549 కోట్లుగా నమోదయ్యాయి.