ట్రంప్‌ చిచ్చులకు రూపాయి చిత్తు

Feb 4,2025 02:30 #Business, #Donald Trump, #rupee fall
  • డాలర్‌ రూ.87.17
  • చరిత్రలోనే రికార్డ్‌ కనిష్టం
  • ఆందోళనేమీ లేదన్న ఆర్ధిక శాఖ కార్యదర్శి

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చిచ్చులకు రూపాయి చిత్తడి అవుతోంది. స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ రోజు రోజుకు అదోపాతాళానికి పడిపోతుంది. సోమవారం డాలర్‌తో రూపాయి మారకం విలువ ఏకంగా 55 పైసలు క్షీణించి 87.17కు దిగజారి.. ఆల్‌టైం కనిష్ట స్థాయిని చవి చూసింది. కెనడా, మెక్సికోలపై 25 శాతం, చైనాపై 10 శాతం చొప్పున ట్రంప్‌ టారీఫ్‌ల పెంపు ప్రకటనతో భారత కరెన్సీ తీవ్ర ప్రభావితమయ్యింది. భారత్‌కు ట్రంప్‌ ప్రభుత్వం వ్యూహాత్మక భాగస్వామి అని గొప్పలు చెప్పుకుంటున్న బిజెపి ప్రభుత్వ వర్గాలకు ట్రంప్‌ టారీఫ్‌ల చర్యలతో రూపాయి పతనం, మార్కెట్ల క్షీణతతోనైనా మేలుకొలుపు కావాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇంటర్‌బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్సేంజీలో డాలర్‌తో రూపాయి విలువ 87 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో ఏకంగా 87.29కి పడిపోయింది. తుదకు 55 పైసలు కోల్పోయి 87.17 వద్ద ముగిసింది. ఇది భారత రూపాయి చరిత్రలోనే అత్యంత పేలవమైన ప్రదర్శన. ఇంత జరుగుతున్నా భయపడాల్సిందేమీ లేదని ఆర్ధిక శాఖ కార్యదర్శి తూహిన్‌ కాంత పాండే పేర్కొనడం గమనార్హం. శుక్రవారం సెషన్‌లో 86.62 వద్ద ముగిసింది.
భారత స్టాక్‌ మార్కెట్ల నుంచి భారీగా విదేశీ సంస్థాగత పెట్టుబడులు (ఎఫ్‌ఐఐ)లు తరలిపోవడానికి తోడు అమెరికా టారీప్‌ల భయాలు, డాలర్‌కు విలువ పెరగడం తదితర పరిణామాలు రూపాయి విలువను ఒత్తిడికి గురి చేశాయని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ముడి చమురు బ్యారెల్‌ ధర 1.41 శాతం పెరిగి 76.74 వద్ద ముగిసింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే డాలరుతో రూపాయి విలువ 90కి చేరినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని నిపుణులు పేర్కొంటున్నారు. రూపాయి ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని, వచ్చే 6-8 వారాల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని ఆర్‌బిఎల్‌ బ్యాంక్‌ ట్రెజరీ హెడ్‌ అన్షుల్‌ చెందక్‌ పేర్కొన్నారు.

దిగుమతులపై సుంకాలు పెంచలేం : ఆర్ధిక శాఖ సెక్రటరీ

ట్రంప్‌ ప్రసంగాలు, చర్యలు, సుంకాలు, బెదిరింపుల పర్యవసానాలతో రూపాయి నేల చూపులు చూస్తోంటే ప్రధానీ మోడీ నోరు విప్పకపోవడం గమనార్హం. మరోవైపు ఆర్ధిక శాఖ భయపడాల్సిందేమీ లేదంటూ మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్ధిక శాఖ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే అన్నారు. కరెన్సీ విలువ క్షీణతపై ఆర్‌బిఐ చూసుకుంటుందన్నారు. రూపాయి విలువ అనేది ఎవరూ నియంత్రించేది కాదన్నారు. దానికంటూ ఒక స్థిరమైన ధర అంటూ ఉండదన్నారు. విదేశీ మదుపర్ల నిధులు తరలిపోవడం ద్వారా రూపాయి విలువ పడిపోవడానికి ఓ కారణమన్నారు. చైనా, మెక్సికో, కెనడా దేశాలపై ట్రంప్‌ సుంకాల పెంపు పరిణామాల నేపథ్యంలో తుహిన్‌ కాంత పాండే స్పందించారు. భారత ప్రభుత్వం దిగుమతులపై సుంకాలు పెంచి ఎల్లప్పుడూ ఇండియన్‌ కంపెనీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భావించొద్దని తుహిన్‌ కాంత పాండే అన్నారు. బడ్జెట్‌లో చాలా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించామన్నారు.

➡️