రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం
ఎస్బిఐ రీసెర్చ్ అంచనా
న్యూఢిల్లీ : దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినందున రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్లను భారీగా తగ్గించడానికి వీలుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) రీసెర్చ్ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 తొలి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 3 శాతం దిగువకు తగ్గొచ్చని తెలిపింది. ఇదే పరిస్థితి కొనసాగితే వడ్డీ రేట్లను 125 బేసిస్ పాయింట్లు (1.25 శాతం) తగ్గించొచ్చని అంచనా వేసింది. హెచ్చు వడ్డీ రేట్ల భారం వేళ ఎస్బిఐ రీసెర్చ్ ప్రకటన రుణ గ్రహీతల్లో ఆశావాదాన్ని నింపుతోంది.
”జూన్-ఆగస్టు సమయంలో 75 బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్ల తగ్గింపును అంచనా వేస్తున్నాము. ద్వితీయార్థంలో మరో 50 బేసిస్ పాయింట్లు తగ్గించొచ్చు. 2025 మార్చిలో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ 3.34 శాతానికి తగ్గి 67 నెలల కనిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. అహారోత్పత్తుల ధరల్లోనూ తగ్గుదల చోటు చేసుకుంది. 2025-26లో స్థూలంగా 4 శాతం లోపే ద్రవ్యోల్బణం ఉండొచ్చు. అల్ప స్థాయిలో ద్రవ్యోల్బణం, తక్కువ వడ్డీ రేట్లు జిడిపి వృద్ధికి మద్దతును అందించనుంది.” అని ఎస్బిఐ తన రీసెర్చ్ రిపోర్టులో పేర్కొంది.
ఆర్బిఐ మానిటరీ పాలసీ కమిటీ ఇటీవల ఫిబ్రవరి, ఏప్రిల్లో జరిగిన వరుస సమావేశాల్లో కీలక వడ్డీ రేట్లకు 25 బేసిస్ పాయింట్ల చొప్పున అర శాతం కోత పెట్టింది. దీంతో రెపోరేటు 6 శాతానికి దిగివచ్చింది. ఇది రుణ గ్రహీతలపై కొంత భారం తగ్గించింది. అయితే భారీగా వడ్డీ రేట్లు తగ్గడం వల్ల డిపాజిట్లపై కూడా ప్రతికూల ప్రభావం పడొచ్చని ఎస్బిఐ రీసెర్చ్ పేర్కొంది. డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గడం ద్వారా ఎఫ్డిల వృద్ధి స్తబ్దతలోకి జారుకునే అవకాశాలు లేకపోలేదని తెలిపింది.
