ఆఖర్లో కలిసొచ్చిన కొనుగోళ్లు – లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

ముంబయి : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐటీ, ప్రైవేటు బ్యాంక్‌ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో మంగళవారం రోజున జరిగిన నష్టాల నుండి కోలుకున్నాయి. రోజంతా లాభ నష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలకు ఆఖర్లో కొనుగోళ్లు కలిసొచ్చాయి. దీంతో సెన్సెక్స్‌ 500 పాయింట్లకు పైగా లాభపడగా.. నిఫ్టీ 23,100 ఎగువన స్థిరపడింది. సెన్సెక్స్‌ బుధవారం ఉదయం 76,114.42 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 75,838.36) లాభాల్లో ప్రారంభమైంది. ఉదయమంతా స్వల్ప లాభాలకే పరిమితమైన సూచీ.. ఓ దశలో స్వల్పంగా నష్టపోయింది. ఆఖరి గంటన్నరలో కొనుగోళ్ల ఉత్సాహంతో సెన్సెక్స్‌ 566.63 పాయింట్ల లాభంతో 76,404.99 వద్ద ముగిసింది. నిఫ్టీ 130.70 పాయింట్ల లాభంతో 23,155.35 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 25 పైసలు బలపడి 86.33 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా, సన్‌ఫార్మా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. టాటా మోటార్స్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఎన్టీపీసీ షేర్లు నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 79.64 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 2771 డాలర్ల స్థాయికి చేరింది.

➡️