న్యూఢిల్లీ : ప్రముఖ ఫుడ్ డెలివరీ వేదిక స్విగ్గీ త్వరలో తన ఫ్లాట్ఫామ్ రుసుంను రెట్టింపు చేయనుందని సమాచారం. ప్రస్తుతం ఉన్న ఫీజును రూ.5 నుంచి రూ.10కి పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. స్విగ్గీ త్వరలో ఐపిఒకు రానున్నందున నష్టాలను తగ్గించుకోవడానికి తన ఫ్లాట్ ఫామ్ ఫీజును రెట్టింపు చేసే యోచనలో ఉందని రిపోర్టులు వస్తున్నాయని ఆంగ్ల మీడియాలో కథనాలు పేర్కొంటున్నాయి. తొలుత ఉచితంగా ప్రారంభించిన ఈ సేవలను 2023 ఏప్రిల్లో కొన్ని నగరాల్లో మాత్రమే ఫుడ్ డెలివరీలపై ప్లాట్ఫామ్ ఫీజు వసూలుచేయడం ప్రారంభించింది. ఆ తర్వాత ప్రతి ఆర్డర్పై రూ.2 చొప్పున చార్జ్ చేసింది. ఆ తర్వాత దీన్ని రూ.5కు పెంచింది. ప్రస్తుతం రెట్టింపు చేసే యోచనలో ఉంది. స్విగ్గీలో రోజుకు 15 లక్షల నుంచి 25 లక్షల ఫుడ్ ఆర్డర్లు నమోదవుతున్నాయి.
