విశాఖకు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : రెండు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గనేందుకు మంగళవారం విశాఖపట్టణం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని అధికారులు స్వాగతించారు. ఉదయం 10:27 గంటలకు తాడేపల్లి నుంచి విశాఖ విమాశ్రయం చేరుకొని అక్కడ నుంచి మధురవాడ ఐటీ హిల్స్‌ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు హెలికాఫ్టర్‌ ద్వారా చేరుకున్నారు. ఈ క్రమంలో విశాఖ విమానాశ్రయం వద్ద, హెలిప్యాడ్‌ వద్ద అధికారులు, రాజకీయ ప్రముఖులు పుష్పగుచ్ఛాలు అందజేసి ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. విశాఖపట్టణం విమానాశ్రయం వద్ద ఇంఛార్జి మంత్రి విడదల రజని, ఎంపి ఎం.వి.వి. సత్యనారాయణ, విప్‌ కరణం ధర్మశ్రీ, మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా కలెక్టర్‌ డా. ఎ. మల్లిఖార్జున, వి.ఎం.ఆర్‌. డి. ఎ. ఛైర్మన్‌ సనపల చంద్రమౌళి, డీసీసీబి ఛైర్మన్‌ కోలా గురువులు, డీసీపీ సత్తిబాబు తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి 10:36 గంటలకు బయలుదేరి హెలికాప్టర్‌ ద్వారా మధురవాడ ఐటీ హిల్స్‌ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్దకు చేరుకున్నారు. హెలిప్యాడ్‌ వద్ద పలువురు నేతలు, అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి అక్కడ నుంచి 10:52 గంటలకు కాన్వారు ద్వారా రాడిస్సన్‌ బ్లూ రిసార్ట్‌ వద్దకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ఉన్నారు.

➡️