
ప్రజాశక్తి - సీతంపేట : గిరిజన గ్రామాల్లో గల డ్రాపౌట్స్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఐటిడిఎ పిఒ కల్పన కుమారి అన్నారు. సోమవారం ఐటిడిఎ పరిధిలోగల అన్ని పాఠశాలల హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్లు, హెడబ్ల్యువోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ డ్రాపౌట్స్ డేటా పక్కాగా తయారు చేసుకోవాలని సూచించారు. బడికి రాకుండా బడి బయట ఉన్న విద్యార్థులను గుర్తించాలని సూచించారు. జెవికె కిట్లు అందరికీ పంపిణీ చేయాలని సూచించారు. అలాగే పాఠ్య పుస్తకాల పంపిణీలో ఎటువంటి అలసత్యం ఉండకూడదని అన్నారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. పాఠశాలలో వైద్య పరీక్షలు తరుచుగా నిర్వహిస్తుండాలన్నారు. అందుకు గానూ సచివాలయ ఎఎన్ఎంలు పాఠశాలకు వెళ్లి వైద్య పరీక్షలు చేసేలా రెండు జిల్లాల డిఎంహెచ్ఒలకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. పాఠశాలల పునః ప్రారంభమయ్యే నాటికి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని సూచించారు. విద్యుత్, తాగునీరు సమస్యలు లేకుండా చూసుకోవాలన్నారు. వసతి గృహాల్లో మెనూ సక్రమంగా పాటించాలన్నారు. ఏకలవ్య పాఠశాలల నిర్మాణాలు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకొంటామన్నారు. బాలికల పాఠశాలలకు ప్రహరీ గోడ నిర్మించేందుకు చర్యలు తీసుకొంటామన్నారు. అన్ని పాఠశాలల్లో 100శాం అడ్మిషన్లు పూర్తి చేయాలని అన్నారు. కార్యక్రమంలో డీడీ సూర్యనారాయణ, ఒఎస్డి (ఎడ్యుకేషన్) ఎం.యుగంధర్, జిసిసి డిఎం జి.సంధ్యారాణి, డిఇఇ కృష్ణ, ఎటిడబ్ల్యుఒలు శ్రీనివాసరావు, మంగవేణి, సూపరిండెంట్ దేశ్, హెచ్ఎంలు, హెచ్ డబ్ల్యువోలు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.