
న్యూఢిల్లీ : ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంకీపాక్స్ వైరస్ వ్యాప్తిపై హెచ్చరిక జారీ చేశారు. విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులకు కఠినమైన ఆరోగ్య పరీక్షలు చేయాలని కేంద్రం మంగళవారం ఆదేశించింది. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో మంకీపాక్స్ లక్షణాలున్న విదేశీ ప్రయాణికులను ఎల్ఎన్జెపి ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించనున్నారు. తీవ్ర జ్వరం, వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలున్న అంతర్జాతీయ ప్రయాణికులను పరీక్షించి వారిని ఆసుపత్రికి తరలించాలని విమానాశ్రయ అధికారులు నిర్ణయించారు.
ఢిల్లీ, కేరళ విమానాశ్రయాల్లో మంకీపాక్స్ అలర్ట్మంకీపాక్స్ రోగులకు పరీక్షలు చేసి వారిని ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించడానికి 20మంది సభ్యులతో కూడిన ప్రత్యేక వైద్య బృందాన్ని విమానాశ్రయంలో నియమించారు. అనుమానిత మంకీపాక్స్ రోగుల నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపుతారు. అయితే ఢిల్లీ జిల్లా యంత్రాంగం మంకీపాక్స్ సోకిన వారి కుటుంబ సభ్యులను నిర్బంధిస్తుంది. మంకీపాక్స్ అనుమానిత రోగులను గుర్తించేందుకు పరీక్షలు చేయనున్నారు. దేశరాజధాని నగరమైన ఢిల్లీలో మంకీపాక్స్ వ్యాధి మొదటి కేసును గుర్తించిన ఒక రోజు తర్వాత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేరళ రాష్ట్రంలోనూ మంకీపాక్స్ కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనూ అలర్ట్ ప్రకటించారు.