ప్రజాశక్తి-యర్రగొండపాలెం: కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యమని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలపర్తి డేవిడ్రాజు అన్నారు. శనివారం యర్రగొండపాలెంలోని హనుమాన్ లాడ్జిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడిపి, వైసీపీ పార్టీలు తోడు దొంగలేనన్నారు. ప్రత్యేక హోదా సాధించడంలో ఘోరంగా విఫలమైనట్లు తెలిపారు. వైఎస్ షర్మిలమ్మ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పూర్వ వైభవం రానుందని తెలిపారు. త్వరలోనే వెలిగొండ ప్రాజెక్టును పరిశీలించేందుకు షర్మిలమ్మ వస్తుందని చెప్పారు. తన కుమారుడు విజేష్రాజుకు యర్రగొండపాలెం టిక్కెట్ ఇవ్వమని అధిష్టానాన్ని కోరినట్లు చెప్పారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పాలపర్తి విజేష్ రాజు మాట్లాడుతూ షర్మిలమ్మ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో అందరికి ఆమోదయోగ్యంగా ఉందన్నారు. రాహుల్ గాంధీ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో కూడా దేశ స్థాయిలో అద్భుతంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పాలపర్తి విజేష్రాజు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు దుగ్గెంపూడి బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
