ప్రజాశక్తి – కడప అర్బన్ తామంటే అధికారులకు చిన్న చూపు ఉందని, సచివాలయ సిబ్బం దికి కూడా లెక్క జేయడం లేదని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గురు వారం మేయర్ కె. సురేష్బాబు అధ్యక్షతన 2024-25 ఆర్థిక సంవత్సరానికి నగర పాలక బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయా కార్పొరేటర్లు తమ డివిజన్లలోని సమస్యలపై సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. సమావేశానికి ఉప ముఖ్యమంత్రి అంజాద్బాషా, కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్చంద్, నగర పాలక సంస్థ అధికారులు, కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 575.93 కోట్లు రాడికిగానూ, రూ. 5002.76 లక్షలు ఖర్చుగా నిర్ణయించారు. రూ. 73. 17 కోట్లు మిగులు నిల్వగా అంచనా వేశారు. ఇందులో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎస్టీ, ఎస్టీలు, వికలాంగులకు, స్త్రీ శిశు సంక్షేమం కోసం నిధులను కేటాయించారు. నికర నిధులో 40శాతం నిధులను మురికివాడలలో అభివద్ధి పనులకు ఖర్చు చేయనున్నారు. ఎస్సీలకు రూ.4.26 కోట్లు, ఎస్టీలకు రూ.1.88 కోట్లు, స్త్రీ, శిశుసంక్షేమం కోసం రూ.1.42 కోట్లు, వికలాంగుల సంక్షేమం కోసం రూ.84 లక్షలు ఖర్చు చేయనున్నారు. రెవెన్యూ డివిజన్ల ద్వారా ఆస్తి పన్ను, గ్రంథాలయ పన్ను, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఆస్తిపన్ను ద్వారారూ.47.15కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. నీటి పన్ను ద్వారా రూ.11.13 కోట్లు, ప్రభుత్వ బదిలీ, పరివాహక పన్నుల ద్వారా రూ.25 కోట్లు, యూజర్ ఛార్జీల ద్వారా రూ.14.13 కోట్లు, బిల్డింగ్ సెన్స్ ఫీజులు ప్రయివేట్ ఖాళీ స్థలాల పై పన్ను, ప్రకటనల పన్ను, కొత్త లేఅవ ుట్లు, ఫ్లాట్ల సబ్ డివిజన్ ద్వారా రూ.34.16 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ముందుగా నగర మేయర్ కెసురేష్ బాబు మాట్లాడుతూ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నాలుగున్నర సంవత్సర కాలంలో రూ.2,597 కోట్ల నగరంలో పెద్ద ఎత్తున అభివద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. అధికారులు, కార్పొరేటర్లు సహకారంతో నగర పాలకసంస్థను అభివద్ధి బాటలో నడిపిస్తున్నామని తెలిపారు. కార్పొరేటర్ షఫీ మంచినీటికి శాశ్వత పరిష్కారం చూపిం చాలని కోరారు. ఒకటో డివిజన్ కార్పొరేటర్ మాట్లాడుతూ అమత్ పథకం కింద కులాయి కనెక్షన్లు ఇవ్వాలని, అంతకంటే ముందు పైప్ లైన్లు వేయాలని కోరారు. రెండవ డివిజన్ కార్పొరేటర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉక్కాయ పల్లెలో మంచినీరు అందడం లేదని బోర్ల ద్వారా నీళ్లు ఇచ్చే పరిస్థితి నుంచి గట్టెక్కించాలని కోరారు. కార్పొరేటర్ బాలస్వామి రెడ్డి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గడపగడపకు తిరుగుతూ ఉంటే కార్పొరేషన్ అధికారులు ఒక్కరూ ఉండడం లేదని సమావేశం దష్టికి తీసుకువచ్చారు. అధికారుల దష్టిలో కార్పోరేటర్లకు విలువ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుధ్య కార్మికుల సంఖ్య కార్పొరేటర్కు తెలియకుండా తగ్గించడం ఎంతవరకు సమంజసం ఉన్నారు. ఐదు నెలలు పనిచేసిన పారిశుధ్య కార్మికుల వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో కార్పొరేషన్ ఉందా అని ప్రశ్నించారు. స్థానిక సమస్యలను వాలంటీర్లు కార్పొరేటర్ల దష్టికి తీసుకువస్తే సచివాలయ సిబ్బంది వారిని బెదిరిస్తూ ఉన్నారని సమావేశం దష్టికి తీసుకువచ్చారు. వీటిపై స్పందించిన కమిషనర్ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు ముంతాబేగం, బండి నిత్యానందరెడ్డి, అడిషనల్ కమిషనర్ రమణారెడ్డి, షపీ, గంగాదేవి, బాలస్వామిరెడ్డి, మల్లికార్జున, సూర్యనారాయణ, మోతుకూరి సుజాత, వెలిగండ్ల శిరీష పాల్గొన్నారు.
