ప్రజాశక్తి-రంపచోడవరం
ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని చేపట్టిన క్షయవ్యాధి అవగాహన ర్యాలీని శనివారం స్థానిక ఐటీడీఏ కార్యాలయం వద్ద ప్రాజెక్ట్ అధికారి సూరజ్ గనోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలోని క్షయ వ్యాధి నిర్మూలనపై అవగాహన లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. క్షయ వ్యాధి లక్షణాలు ఉన్న వారు వెంటనే ఆసుపత్రులకు వచ్చి టెస్టులు చేయించుకుని మందులు వాడాలని సూచించారు. 2025 నాటికి ప్రపంచంలోనే క్షయవ్యాధి పూర్తిస్థాయిలో నిర్మూలించే విధంగా అందరం కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భారతదేశపు ఆరోగ్య సంస్థల నివేదికల ప్రకారం 2.6 లక్షల మంది క్షయవ్యాధితో బాధపడుతున్నారని, సుమారు 4 వేల మంది ప్రతి సంవత్సరం ఈ వ్యాధితో చనిపోవుతున్నారని తెలిపారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేసి, అక్కడ మానవహారంగా నిర్వహించారు. క్షయవ్యాధి నిర్మూలలపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎడియంహెచ్ఓ డాక్టర్ జి.ప్రకాశం, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మి, డాక్టర్ వెంకట ఇందిరా, వైద్యాధికారులు రాధిక, అపూర్వ, వినోద్, సుజిత, సాహిన్, ఎయన్యంలు ఆశ వర్కర్లు, డిగ్రీ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.కొయ్యూరు : కొయ్యూరు మండల కేంద్రంలో శనివారం రాజేంద్రపాలెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో క్షయవ్యాధి నివారణ ర్యాలీ నిర్వహించారు. టీబీని జయించి, దేశాన్ని గెలిపించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రపాలెం పిహెచ్సి సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.సీలేరు : జీకే వీధి మండలం సప్పర్ల పిహెచ్సి పరిధిలో వరల్డ్ టీబి డే సందర్భంగా వైద్య సిబ్బంది శనివారం అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు ప్రసన్నకుమార్, సందీప్ మాట్లాడుతూ మూడు వారాలకు మించి దగ్గుతో బాధపడేవారు టీబి వ్యాధి సోకినట్లు గమనించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన మందులు ఉచితంగా ఆసుపత్రిలో పొందవచ్చునని తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది అశోక్, నానాజీ, కిషోర్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.