ప్రజాశక్తి-పుల్లలచెరువు: భవిష్యత్కు గ్యారెంటీ టిడిపితోనే సాధ్యమని టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్బాబు అన్నారు. పుల్లలచెరువు మండలంలోని ముటుకుల గ్రామంలో గురువారం బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికీ తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎరిక్షన్బాబు మాట్లాడుతూ మహిళలకు టీడీపీ ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోలోని అంశాలపై అవగాహన కల్పించారు. తల్లికి వందనం ద్వారా ఇంట్లో చదువుతున్న ప్రతి ఒక్కరికీ ఏటా రూ.15 వేలు, ఆడబిడ్డ నిధి ద్వారా ప్రతినెలా రూ.1500, అన్నదాతలకు ఏటా రూ.20 వేలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ యువతకు యువగళం ద్వారా ఉద్యోగాల కల్పన, దీపం పథకం ద్వారా ఏటా మూడు సిలిండర్లను ఉచితంగా అందజేస్తారని అన్నారు. గ్రామ ప్రజలకు ష్యూరిటీ బాండ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ పయ్యావుల ప్రసాద్, జనసేన మండల కన్వీనర్ కటారి అచ్చయ్యతో పాటు మండలంలోని టిడిపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.
