ప్రజాశక్తి-సంతనూతలపాడు: డిజిటల్ చెల్లింపు అవగాహన వారోత్సవాల్లో భాగంగా మండలంలొని మైనంపాడు డైట్లో మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్బిఐ అధికారి నాగరాజు మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి డిజిటల్ చెల్లింపులపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా బ్యాంకింగ్ వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ముఖ్యంగా ఏటీఎం వాడేటప్పుడు చేయవలసినవి, చేయకూడనివి తదితర విషయాల గురించి వివరించారు. ఎన్ఈఎఫ్టి, ఆర్టిజీఎస్, ఐఎంపిఎస్, మైక్రో ఎటిఎం, పాయింట్ ఆఫ్ సేల్, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ పట్ల ప్రతి విద్యార్థీ అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. డైట్ కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బారావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థీ ఈ అంశాలపై అవగాహన కలిగి వుండి వారి జీవితంలో ఎలాంటి మోసాలకు గురికాకుండా అందరూ అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. హైస్కూల్ హెచ్ఎం నరసింహారావు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఆర్థికాక్షరాస్యతపై అవగాహన చాలా ముఖ్యమని, పొదుపు గురించి, అవసరమైన ఖర్చులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. కార్యక్రమంలో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ స్టేట్ కోఆర్డినేటర్ కే అశోక్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వై రవితేజ, చీమకుర్తి సీఎస్ఎల్ కౌన్సిలర్లు అమృతరాజు, చిన్న రాజయ్య, ఇతర సిఎఫ్ఎల్ సిబ్బంది పాల్గొన్నారు.
