నెలాఖరులోగా సాలూరుకు రైలు బండి

ప్రజాశక్తి – సాలూరు : ఈనెలాఖరులోగా సాలూరుకు రైలు బండి రానుంది. ఈ మేరకు రైల్వే అధికారులు బుధవారం రాత్రి బొబ్బిలి నుంచి రైలు బండిని ట్రయిల్‌ రన్‌ చేశారు. ఇది విజయవంతం కావడంతో వారం రోజుల్లో రైలు బండి నడపాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. కొద్దినెలల క్రితం ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే అధికారులు సాలూరు రైలు మార్గం గుండా ప్రయాణించి బండి నడపడానికి అవకాశాలను పరిశీలించారు. దీనిలో భాగంగా ట్రయిల్‌ రన్‌ విజయవంతంగా నిర్వహించారు. 8 బోగీలతో ఇఎంయు రైలు బండిని నడపనున్నారు. సాలూరు బొబ్బిలి మధ్య సుదీర్ఘ కాలం రైలు బస్సును రైల్వేశాఖ నడిపింది. రైలు బస్సు నిర్వహణకు అయ్యే ఖర్చులు కూడా రాకపోవడంతో అధికారులు బస్సుని నిలిపివేశారు. విజయనగరం, విశాఖపట్నం మధ్య నడిచే రైలు బండిని బొబ్బిలి మీదుగా సాలూరు వరకు నడపాలని నిర్ణయించారు. అయితే గతంలో రైలు బండి ఇక్కడ నుంచి బయలు దేరే సమయంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉదయం వేకువ జామున 4.30 గంటలకు సాలూరు నుంచి బయలుదేరేలా సమయాన్ని నిర్ధేశించడంపై ఈ ప్రాంతవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నుంచి బయలు దేరే సమయం మార్చాలని కోరుతున్నారు.

➡️