అమరావతి నుండి నిజాంపట్నం పోర్ట్‌కు 4లైన్ల రహదారి

May 6,2025 23:53

సమావేశంలో మాట్లాడుతున్న బాపట్ల ఎంపి కృష్ణప్రసాద్‌
ప్రజాశక్తి-గుంటూరు :
అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్డు నుండి నిజాంపట్నం పోర్ట్‌ వరకు కొత్తగా (గ్రీన్‌ ఫీల్డ్‌ ) నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణంపై స్టేక్‌ హోల్డర్స్‌తో కలక్టరేట్‌లో మంగళవారం సమావేశం జరిగింది. గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి, బాపట్ల కలెక్టర్‌ జె.వెంకటమురళి, బాపట్ల ఎంపి టి.కృష్ణప్రసాద్‌, గుంటూరు జేసీ భార్గవ్‌తేజ, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, బాపట్ల ఎమ్మెల్యే వి.నరేంద్రవర్మ, తెనాలి సబ్‌ కలెక్టర్‌ సంజనాసింహా, జిఎంసి కమిషనర్‌ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్డు నుండి నిజాంపట్నం పోర్ట్‌ వరకు 47.848 కిలో మీటర్ల వేరకు రోడ్డు నిర్మాణం వల్ల ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని, వస్తు రవాణా సదుపాయం పెరుగుతుందని అన్నారు. ఈ నాలుగు లైన్లరోడ్డు నిర్మాణానికి సంబంధిత కేంద్ర మంత్రులతో అనేక దఫాలుగా చర్చించి వారిని ఒప్పించి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు కృషి చేసినట్లు చెప్పారు. ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయితే సూర్యలంక బీచ్‌కు, చీరాల బీచ్‌తో పాటు అనేక ఆధ్యాత్మిక ప్రదేశాలు, పొన్నూరులోని శ్రీవీరాంజనేయ స్వామి దేవస్థానం పర్యటకంగా భివృద్ది చెందుతాయని చెప్పారు. వైజాగ్‌-చెన్నరు ఇండిస్టీయల్‌ కారిడార్‌కు మంచి కనెక్టివిటీ ఏర్పడుతుందని, నిజాంపట్నం ఫిషింగ్‌ హార్బర్‌కు ఎక్కడా అవరోధం లేకుండా రోడ్డు ఏర్పడడం వల్ల మరింత ఆర్థికాభివృద్ధి బలోపేతం అవుతుందని వివరించారు. రోడ్డు నిర్మాణ పనులకు అన్ని అనుమతులు పొందిన తరువాత ఆరు మాసాల్లోపు భూసేకరణ పనులు పూర్తి చేయాలని, 18 మాసాల్లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరారు. అనంతరం స్టేక్‌ హోల్డర్స్‌ అయిన ఆర్‌అండ్‌బి, విద్యుత్‌, ఇరిగేషన్‌, రైల్వే, ఫిషరీస్‌, అగ్రికల్చర్‌, పంచాయితీ రాజ్‌, దేవాదాయ శాఖ, అటవీ శాఖ అధికారులు వారి వారి శాఖలకు సంబంధించి ఏదైనా అంశాలుంటే పూర్తి వివరాలతో శుక్రవారం సాయంత్రం లోపు అందించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మీ, బాపట్ల జిల్లా కలెక్టర్‌ జె.వెంకట మురళి సూచించారు. వారు అందించిన వివరాలను క్రోడీకరించి ప్రాజెక్టు రిపోర్ట్‌ తయారు చేసి ఢిల్లీలోని నేషనల్‌ హైవే అథారిటీ వారికి పంపి రోడ్డు నిర్మాణానికి అనుమతులు కోరతామని తెలిపారు. సమావేశంలో ఎన్‌హెచ్‌ఎఐ ప్రాజెక్టు పార్వతీశం, డిఆర్‌ఒ ఎన్‌.ఎస్‌.కే.ఖాజావలి, పంచాయితీ రాజ్‌ ఎస్‌ఇ బ్రహ్మయ్య, డిపిఒ నాగసాయికుమార్‌ పాల్గొన్నారు.

➡️