20న సమ్మెలో కార్మికులు, కర్షకులందరూ పాల్గొనాలిప్రజాశక్తి-పిడుగురాళ్ల : దేశవ్యాప్తంగా ఈనెల 20న జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతూ సిఐటియు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక కన్నెగంటి హనుమంతు భవనంలో గురువారం సమావేశం సిఐటియు నాయకులు సంపత్ వెంకటకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్ మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం కార్పొరేటర్లు సేవలో మునిగి తేలుతోందని, వారికి లాభాలు చేకూర్చే విధంగా కార్మికుల శ్రమను దోపిడీ చేసే విధానాలను ఉధృతం చేసిందని అన్నారు. ఇందులో భాగంగా 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందని, కార్మికులను కట్టు బానిసలుగా మార్చబూను కుందని మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు అప్పజెప్పే విధానాలు చేపట్టిందన్నారు. వీటికి వ్యతిరేకంగా గ్రామీణ బంద్, పారిశ్రామిక వాడల్లో సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అంగన్వాడి, ఆశా, మధ్యాహ్న భోజనం, ఇతర స్కీమ్ వర్కర్లతోపాటు మున్సిపల్, భవన నిర్మాణం, సున్నం తదితర రంగాల్లోని అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. అనంతరం సిఐటియు మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు, ఎఎఫ్టియు (న్యూ) నాయకులు కొండారెడ్డి చెన్నయ్య, సున్నం బట్టి వాచ్మెన్ యూనియన్ సిటియు నాయకులు ఓర్చు కృష్ణ మాట్లాడారు. డి.శాంతమణి, షేక్ హజ్ర, జయశ్రీ, బి.కొండలు, జి.నాగేశ్వరరావు, ఎ.వెంకటేశ్వర్లు, సుధాకర్, కె.సాగర్బాబు పాల్గొన్నారు.
తాము 20వ తేదీన సమ్మెలో పాల్గొంటున్నట్లు పిడుగురాళ్ల ప్రాజెక్టు ఐసిడిఎస్ సూపర్వైజర్ కోటేశ్వరికి అంగన్వాడీలు సిఐటియు ఆధ్వర్యంలో గురువారం సమ్మె నోటీసు అందజేశారు. నాయకులు మాట్లాడుతూ గతంలో 42 రోజులపాటు చేసిన సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రస్తుత ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న బిల్లులు, జీతాలు ఇవ్వాలని, ఐసిడిఎస్కు నిధులు పెంచాలని, సెంటర్ పరిధిలో సమస్యలు పరిష్కరించాలని, గ్రాడ్యుటీని అమలు చేయాలని కోరారు. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మెలో పాల్గొంటున్నట్లు చెప్పారు. సిఐటియు నాయకులు టి.శ్రీనివాసరావు, అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు షేక్ హజ్రా, డి.శాంతమణి పాల్గొన్నారు.
ప్రజాశక్తి-సత్తెనపల్లి : మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) జిల్లా అధ్యక్షులు వి.చంద్రకళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై ఈనెల 20న జరిగే సమ్మెలో తామూ భాగస్వాములం అవుతున్నామని చెప్పారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ ఎం.ఆనంద్ కుమార్కు నోటీసు అందించారు. మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు జె.రాజ్కుమార్, మున్సిపల్ కార్మికులు ఎం.సత్యవతి, దుర్గ పాల్గొన్నారు.
ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈనెల 20వ తేదీన సార్వత్రిక సమ్మెలో తాము పాల్గొంటున్నామని తెలియజేస్తూ ఆశా వర్కర్లు బైపాస్ రోడ్లోని ప్రైమరీ హెల్త్ సెంటర్లోని డాక్టర్కు సిఐటియు ఆధ్వర్యంలో నోటీసు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టబద్ధమైన సౌకర్యాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు అమలు చేయాలని కోరారు. 20 ఏళ్లుగా పేదలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నామని, తమను కార్మికుల గుర్తించాలని డిమాండ్ చేశారు.
