May 9,2025 22:41

వినుకొండ సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షులు హనుమంతరెడ్డి20న కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్‌ విధానాలపై సమ్మెప్రజాశక్తి-గుంటూరు : కార్మికుల హక్కులు హరించే విధంగా, రైతుల సంక్షేమాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 20వ తేదీన జరిగే సమ్మెను జయప్రదం చేయాలని రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక బ్రాడీపేటలోని పిఎల్‌ రావు భవన్‌లో రైతు, కార్మిక సంఘాల సమావేశం నిర్వహించారు. వివిధ సంఘాల జిల్లా నాయకులు కంచుమాటి అజరు, పచ్చల శివాజీ, పాశం రామారావు, ఈమని అప్పారావు, మన్నవ హరిప్రసాద్‌, దండా లక్ష్మి నారాయణ, మేడా హనుమం తురావు, ఎ.అరుణ్‌ కుమార్‌, బి.లక్ష్మణరావు, ప్రొఫెసర్‌ ఎన్‌.వేణుగోపాలరావు, నాగమల్లేశ్వ రరావు, బొట్ల రామకృష్ణ, కంజుల విఠల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తూ, ఆహార పంటలు ఉత్పత్తి చేస్తున్న రైతులను దెబ్బతిసే విధంగా వ్యవసాయాన్ని కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించే చట్టాలను కేంద్రం తీసుకొచ్చిందన్నారు. పంటలకు మద్దతు, గిట్టుబాటు ధరలు రాక రైతులు అప్పుల పాలవుతున్నారని, ఈ క్రమంలో మద్దతు ధరల చట్టం తేవాలని డిమాండ్‌ చేశారు. కార్మిక చట్టాలను రద్దు చేసి, కార్పొరేట్లకు అనుకూలంగా లేబర్‌ కోడ్‌లు కేంద్ర ప్రభుత్వం తెచ్చిందని, కార్మికులు సుదీర్ఘకాలం పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి, కార్మికులు ఆధునిక బానిసలుగా మార్చాలని కేంద్రం ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. లేబర్‌ కోడ్‌లు రద్దు చేసి, కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని కోరారు. రైతులు, కార్మికుల ప్రయోజనాల కోసం జరుగుతున్న సమ్మెలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ప్రజాశక్తి – వినుకొండ : ఈనెల 20న నిర్వహించే సార్వత్రిక సమ్మె జయప్రదం కోసం స్థానిక శివయ్య భవన్‌లో ఎఐటియుసి-సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె సన్నాహకంగా రౌండ్‌టేబుల్‌ సమావేశం శుక్రవారం జరిగింది. సమావేశానికి ఎఐటియుసి నాయకులు షేక్‌ కొండ్రముట్ల చిన్న సుభాని అధ్యక్షత వహించగా సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.హనుమాంతరెడ్డి మాట్లాడుతూ అన్ని రంగాల కార్మికులు సమ్మెలో భాగస్వామ్యం కావాలన్నారు. కార్మికులు దశాబ్ధాల పాటు పోరాడి సాధించుకున్న హక్కులను నాలుగు కోడ్‌లుగా చేసి హక్కులను హరిస్తున్నారని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ కంపెనీలకు దారాదత్తం చేయబూనుకుందని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు మారుతి వరప్రసాద్‌, జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు, రైతుసంఘం నాయకులు ఉలవలపూడి రాము, ఎ.గోపాలరావు, బూదాల శ్రీనివాసరావులు మాట్లాడుతూ కార్మికులతోపాటు రైతులపైనా కేంద్ర ప్రభుత్వం తన కబంధ హస్తాలను చాచిందన్నారు. ఈ విధానాలను రైతులు, కార్మికులు, ఉద్యోగులు ఐక్యంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యక్రమంలో వివిధ సంఘాలు, యూనియన్‌ల నాయకులు బి.వెంకటేశ్వర్లు, వెంకటప్పయ్య, పి.లాల్‌ఖాన్‌, ఆర్‌.వందనం, బి.చిన్న, పి.వెంకటేశ్వర్లు, షేక్‌ కిషోర్‌, కె.మల్లికార్జునరావు, ఆర్‌.శ్రీనివాసరావు, షేక్‌ నాగూర్‌, ఎస్‌.అబ్రహం రాజు, ఎస్‌.సాయిబాబు, పి.ఏసు, దేవమ్మ, కె.మల్లికార్జునరావు పాల్గొన్నారు.

గుంటూరు సమావేశంలో పాల్గొన్న నాయకులు

➡️