ఫొటో : మాట్లాడుతున్న జిల్లా మలేరియా అధికారిణి హుసేనమ్మ
ప్రతిరోజు 50 గృహాలను సందర్శించాలి
ప్రజాశక్తి ఆత్మకూరు అర్బన్ : ఇటీవల కాలంలో కురిసిన వర్షాలతో సీజనల్ వ్యాధులైన మలేరియా, చికున్ గున్యా, టైఫాయిడ్, తదితర వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని, ఎఎన్ఎంలు, ఆశాలు ప్రతి రోజు 50 గృహాలను సందర్శించి ఇంటి పరిసరాను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా మలేరియా అధికారిణి హుసేనమ్మ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని అర్బన్ పిహెచ్సిని తనిఖీ చేసి, అనంతరం సిబ్బందితో మాట్లాడారు. నిల్వ నీటిలో దోమలు పెరిగే అవకాశముందని ప్రజలకు వాటిపై అవగాహన కల్పించాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించాలన్నారు. ప్రజలకు అవగాహన సదస్సుల ద్వారా ఈ విషయాలను తెలియజేయాలని, జ్వరాల కేసులు ఉంటే వెంటనే ఫీవర్ సర్వే చేసి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో డెంగీ, మలేరియా, చికున్గున్యా, డయేరియా కేసులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షేక్ అస్మా, ఎంపిహెచ్ఇఒ ఎస్.సుధాకర్, ఎంపిహెచ్ఎస్ యు పార్వతి, ఎఎన్ఎంలు పాల్గొన్నారు.