పోలీసుల అదుపులో బియ్యం అక్రమ రవాణా ముఠా
నలుగురు నిందితుల అరెస్ట్
ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురిని విశాఖపట్నం వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం… పోలీస్ కమిషనర్ కార్యాలయానికి అందిన సమాచారం మేరకు పూర్ణామార్కెట్, ఆయిల్ మిల్ సందులో వెంకటేశ్వరరావు పేరు మీద ఉన్న రేషన్ డిపో (0386153)పై వన్టౌన్ పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఉండాల్సిన బియ్యం కన్నా 48.7 క్వింటాళ్ల బియ్యం (సుమారు 85 బస్తాలు) అధికంగా ఉండటాన్ని గుర్తించారు. అదే సమయంలో సదరు రేషన్ షాప్ యజమాని ఎపి39 టియు 0217 బొలెరో వాహనంలో 13 ప్లాస్టిక్ బస్తాలు పిడిఎస్ బియ్యం రవాణా చేసేందుకు సిద్ధంగా ఉండడాన్ని కూడా గుర్తించారు. కొల్లి లోవరాజు, కర్రి దుర్గారావు, కిల్లి వెంకటరమణ, మునకాల తేజను అరెస్టు చేశారు. వెంకటేశ్వరరావు పేరు మీద ఉన్న రేషన్ డిపోను సివిల్ సప్లై అధికారులు సీజ్ చేశారు. 6ఏ కేసును నమోదు చేశారు. కాగా భారీగా రేషన్ బియ్యాన్ని పట్టుకున్న వన్టౌన్ పోలీసులను సిపి శంకబ్రత బాగ్జీ అభినందించారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యం