ప్రజాశక్తి చల్లపల్లి (కృష్ణా) : నాసిరకం మొక్కజొన్న విత్తనాలు నిలువునా ముంచాయని రైతు, నడకుదురు గ్రామ సర్పంచ్ గొరిపర్తి సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ సురేష్ చల్లపల్లి మండలం నడకుదురు, రాముడుపాలెం, మోపిదేవి మండలం కే.కొత్తపాలెం గ్రామాల్లో పదకొండు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఘంటసాల మండలం శ్రీకాకుళంలో వెంకట పద్మావతి ట్రేడర్స్ లో 3,600 గ్రాముల బరువు ఉండే విత్తనాల ప్యాకెట్ (సిజెంటా-6802) ఒక్కొక్కటి రూ.రెండు వేల చొప్పున సురేష్ 24 ప్యాకెట్ల విత్తనాలు కొనుగోలు చేసి తన మెట్ట భూముల్లో మొక్కజొన్న సాగు చేపట్టగా, 50 శాతం కూడా విత్తనాలు మొలకెత్తలేదని వాపోయారు. దీంతో తనకు రూ.ఐదు లక్షల మేరకు నష్టం కలిగిందని రైతు సర్పంచ్ సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
