విద్యుత్‌ పోల్‌ ను ఢీకొన్న ఇసుక ట్రాక్టర్‌

ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్‌ (గుంటూరు) : ఇసుక లోడుతో ప్రాతూరు వైపు నుండి వస్తున్న ట్రాక్టర్‌ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి, విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న ఘటన మంగళవారం ఎంటిఎంసీ పరిధిలోని కుంచనపల్లి గ్రామ పరిధిలోని అపర్ణ బహుళ అంతస్తుల భవనం ఎదురుగా, బాటమ్స్‌ బార్‌ సమీపంలో చోటుచేసుకుంది. దీంతో విద్యుత్‌ స్తంభం పక్కకు ఒరిగింది. వందలాది వాహనాలు రద్దీగా ప్రాతూర్‌ రోడ్డు వైపు నిత్యం తిరుగుతూ ఉంటాయి. ఈ ఘటన జరిగినప్పుడు ఎవ్వరికి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. ట్రాక్టర్‌ వేగం ఇంకాస్త ఎక్కువగా ఉంటే పంట కాలవలోకి దూసుకెళ్లే ప్రమాదం జరిగి ఉండేది. ఈ ఘటనతో మూడు గంటల పాటు కుంచనపల్లి గ్రామ పరిధిలో విద్యుత్‌ కు అంతరాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన విద్యుత్‌ అధికారులు క్రేన్‌ సహాయంతో పక్కకు ఒరిగిన విద్యుత్‌ స్తంభాన్ని యధావిధిగా సరి చేసి, విద్యుత్‌ పునరుద్ధరించారు.

➡️