అభివృద్ధి పనుల్లో తీవ్ర జాప్యం

May 8,2025 21:05

 వారం రోజుల్లో శ్యామలాంబ పండగ 

మౌలిక సదుపాయాలు కల్పన సాధ్యమేనా?

మరుగుదొడ్ల మరమ్మతులు ఏమయ్యాయి?

 జనంలో జోరుగా చర్చోపచర్చలు

ప్రజాశక్తి-పార్వతీపురం, సాలూరు :  ఈనెల 18 నుంచి 20వరకు మూడు రోజులు పాటు సాలూరు పట్టణంలో శ్యామలాంబ పండగ జరుగనుంది. ఇంకా వారం రోజులే గడువు ఉన్నా ఎక్కడా అభివృద్ధి పనులు కానరాకపోవడం పట్ల పట్టణ ప్రజల్లో చర్చ జరుగుతోంది. రెండు రోజుల క్రితం మున్సిపల్‌ కార్యాలయంలో ంమంత్రి సంధ్యారాణి శ్యామలాంబ పండుగ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌,ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు.15 ఏళ్ళ తరువాత నిర్వహించనున్న పండగ కావడంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యుత్‌ సరఫరా, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కానీ ఆ దిశగా ఎక్కడా పనులు చేపట్టిన దాఖలాలు లేవు. శ్యామలాంబ పండగ నేపథ్యంలో పట్టణంలో వివిధ మౌలిక సదుపాయాల కల్పన కోసం 2 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి మంజూరయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 40 మున్సిపాలిటీ లకు ఈ నిధులు మంజూరయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ నిధులు శ్యామలాంబ పండుగ కోసం తానే మంజూరు చేయించానని మంత్రి సంధ్యారాణి చెప్పారు. మార్చి 17న ఈ నిధులు మంజూరైతే ఇంత వరకు ఈ నిధులతో పట్టణంలో చేయాల్సిన అభివద్ధి పనులు చేయకపోవడానికి కారణమెవరనే చర్చ జరుగుతోంది. రెండు రోజుల క్రితం మున్సిపల్‌ కార్యాలయంలో శ్యామలాంబ పండుగ ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో మంత్రి మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగ నిమిత్తం పట్టణంలో తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణకు ఇబ్బంది లేకుండా పనులు చేయడానికి రెండు కోట్లు తీసుకొస్తే ఖర్చు చేయలేదని ఆమె మున్సిపల్‌ అధికారులను ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు మంజూరై రెండు నెలలైనా ఖర్చు చేయకపోవడం వెనుక అధికారపార్టీ పట్టణ నాయకుల వైఫల్యం కూడా ఉంది. రెండు కోట్ల రూపాయలతో ఏయే పనులు చేపట్టాలనేది కౌన్సిలర్‌ ల సిఫార్సు మేరకు అధికారులు ప్రతిపాదించాలి.ఈ పనులను కౌన్సిల్‌ లో ఆమోదించాలి. అయితే మంత్రి సంధ్యారాణి నామినేషన్‌ పద్ధతిలో తమ పార్టీ నాయకులతో పనులు చేయించాలని భావించినట్లు తెలిసింది. నామినేషన్‌ పద్దతిలో పనులు చేపట్టడం కుదరదని, కౌన్సిల్‌ తీర్మానం మేరకే జరగాలని మున్సిపల్‌ అధికారులు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ తతంగమంతా జరిగేసరికి పండగ ముహూర్తం సమీపించింది. గత నెలలో జరిగిన మున్సిపల్‌ సమావేశం లో ప్రతిపాదించిన పనులను కౌన్సిల్‌ ఆమోదించింది. ఆ పనులకు టెండర్లు పిలిచి మళ్ళీ కౌన్సిల్‌ లో ఆమోదించాల్సి వుంది. ఒకటి రెండు రోజుల్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి రెండు కోట్ల రూపాయలతో పనులు ఆమోదించే లా చూస్తామని అధికారులు చెబుతున్నారు. సరిగ్గా 8 రోజుల్లో పండుగ ప్రారంభం కానుంది.ఈలోగా ప్రతిపాదించిన పనులు పూర్తి చేయడం కాంట్రాక్టర్‌ లకు, అధికారులకు కత్తి మీద సాము లాంటిదే. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి సంధ్యారాణి నిధులు ఖర్చు చేయకపోవడం వెనుక అసలు కారణాన్ని మరుగున పెట్టి అధికారులపై చిందులు వేయడం చర్చనీయాంశమైంది.వారం రోజుల్లో మరుగుదొడ్ల మరమ్మతులు అయ్యేనా?పట్టణంలో చాలా చోట్ల సామాజిక మరుగుదొడ్లు మరమ్మతుల కు గురై నిరుపయోగంగా మారాయి. గత మూడేళ్ళుగా ప్రజలు వీటిని వినియోగించడం లేదు. పట్టణంలో పేదలు ఎక్కువగా నివసించే మురికివాడలకు సమీపంలో ఈ సామాజిక మరుగుదొడ్లను నిర్మించారు. సరిగ్గా ఏడెనిమిది నెలల క్రితం మంత్రి సంధ్యారాణి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మున్సిపల్‌ కార్యాలయం తనిఖీ చేశారు. ఆ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పట్టణం లో పాడైన సామాజిక మరుగుదొడ్ల ను వారం రోజుల్లో మరమ్మతు చేయాలని అధికారులను ఆదేశించారు. వెంటనే అధికారులు మరుగుదొడ్ల మరమ్మతు పనుల కు ప్రతిపాదన చేశారు. మున్సిపల్‌ జనరల్‌ ఫండ్‌ లో నిధుల్లేవని, మరుగుదొడ్ల మరమ్మతు పనులు చేపట్టలేమని చేతులెత్తేశారు. నిధులు లేకపోతే జిల్లా కలెక్టర్‌ అడిగి 20లక్షలు మంజూరు చేయిస్తానని మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు నిధులు మంజూరు చేయించలేదు. మరుగుదొడ్ల మరమ్మతు పనులు జరగలేదు. దీంతోశ్యామలాంబ పండుగ లోగా సామాజిక మరుగుదొడ్ల మరమ్మతు పనులు పూర్తయ్యే అవకాశం లేదు.

➡️