అభిషేక్‌రెడ్డికి కన్నీటి తుది వీడ్కోలు

ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సమీప బంధువు వైసిపి నాయకులు డాక్టర్‌ వైఎస్‌.అభిషేక్‌రెడ్డి శుక్రవారం హైదరాబాదులోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో మృతి చెందారు. ఆయన భౌతికకాయాన్ని అదేరోజు రాత్రి పులివెందులలోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. జగన్మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతి శనివారం బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో పులివెందులకు చేరుకుని అభిషేక్‌రెడ్డి నివాసంలో భౌతికకాయానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. జగన్‌ భావోద్వేగానికి లోనయ్యారు. రోడ్డుపై నడుచుకుంటూ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అభిషేక్‌రెడ్డి అంతిమయాత్రకు జిల్లాలోని వైసిపి శ్రేణులు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. క్రైస్తవ మతాచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. తర్వాత హెలికాప్టర్‌ ద్వారా బెంగళూరుకు బయలుదేరి వెళ్లిపోయారు. అభిషేక్‌రెడ్డికి కడప పార్లమెంట్‌ సభ్యులు వైఎస్‌.అవినాష్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, శాసనమండలి మాజీ చైర్మన్‌ సతీష్‌ కుమార్‌రెడ్డి, కడప మేయర్‌ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, వైఎస్‌ మనోహర్‌రెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ వైఎస్‌.ప్రమీలమ్మ, వైఎస్‌.ప్రతాప్‌రెడ్డి, పులివెందుల నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి బీటెక్‌ రవి నివాళులర్పించారు.సుశీలమ్మను పరామర్శించిన జగన్‌ : కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న తన సమీప బంధువు వైఎస్‌.ఆనందరెడ్డి సతీమణి వైఎస్‌. సుశీలమ్మను జగన్మోహన్‌రెడ్డి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

➡️