మైలవరం (ఎన్టిఆర్) : ఇటీవల ఏర్పడ్డ రాష్ట్ర నూతన ప్రభుత్వం అడ్డగోలుగా వివిధ రకాలతో విద్యుత్ చార్జీలను పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని సిపిఎం మట్టి మండల కార్యదర్శి సిహెచ్ సుధాకర్ అన్నారు. మైలవరం గ్రామం టి ఆర్ నగర్ లో సిపిఎం పార్టీ షేక్ మైబూబుబి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రూ ఆఫ్ చార్జీలను 2022, 23, 24 సంవత్సరాలకు సంబంధించి అదనపు భారాన్ని బిల్లులకు జమ చేయడం సరైనది కాదని అన్నారు. దీనితో సామాన్యుడు బిల్లులు కట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు, అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమన్న చెప్పిన చంద్రబాబు నేడు చేస్తున్న పని ఏంటని ప్రశ్నించారు. అదేవిధంగా ఆదానితో ఒప్పందం పెట్టుకుని ఒక వైపున రైతులకు వివిధ వ్యాపార సంస్థలకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేస్తుండటం తప్పు పట్టారు. విద్యుత్ బారాలతో మహిళలపై మరింత భారం పడుతుందని అన్నారు, ఇటువంటి విధానాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ టౌన్ కమిటీ సభ్యురాలు షేక్ మహబూబూబి , ఎస్డి ఆశ, భుఖ్య నాగమల్లేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.