ప్రజాశక్తి-విజయనగరంకోట : రాష్ట్రంలో వివిధ జిల్లా పోలీసులు మూడు మాసాల్లో చేధించిన కేసుల దర్యాప్తును పరిశీలించి, వాటిలో ఉత్తమంగా దర్యాప్తు చేసిన కేసులకు ఇచ్చే ఎబిసిడి (అవార్డు ఫర్ బెస్ట్ ఇన్ క్రైం డిటెక్షన్) అవార్డులలో విజయనగరం జిల్లా పోలీసులకు మూడవ స్థానం లభించినట్లు ఎస్పి వకుల్ జిందాల్ తెలిపారు. ఈమేరకు రాష్ట్ర డిజిపి హరీష్కుమార్ గుప్తా నుంచి పోలీసులు అవార్డును అందుకున్నారు. విజయనగరం జిల్లా వన్ టౌన్ పోలీసులు చేధించిన డిజిటల్ అరెస్టు కేసుకు ఎబిసిడి అవార్డుల్లో మూడవ స్థానం లభించింది. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన వన్ టౌన్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐవి.ఎల్.ప్రసన్న కుమార్, కానిస్టేబులు వై.రామరాజుతోపాటు కేసు దర్యాప్తులో ఎప్పటికప్పుడు దిశా నిర్ధేశం చేసి, ఆయా రాష్ట్రాల పోలీసుల సహాయ, సహకారాలు లభించే విధంగా చర్యలు చేపట్టిన ఎస్పికి రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ ఎబిసిడి అవార్డు, ప్రశంసా పత్రం అందజేశారు. సిఐ ఎస్.శ్రీనివాస్, ఎస్ఐ వి.ఎల్.ప్రసన్న కుమార్, కానిస్టేబులు వై.రామరాజును డిజిపి హరీష్ కుమార్ గుప్తా, పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.
