ప్రభుత్వ శాఖలు కార్యాచరణ రూపొందించాలి
రోడ్డుభద్రత కమిటీ సమావేశంలో ఇన్ఛార్జి కలెక్టర్
ప్రజాశక్తి-విజయనగరం కోట : జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్టుగా గుర్తించిన బ్లాక్ స్పాట్ ప్రదేశాల్లో తదుపరి మరో ప్రమాదం జరగకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత ప్రభుత్వ శాఖలపై వుందని, ఆ దిశగా ఆయా శాఖలు చేపట్టాల్సిన కార్యాచరణపై నివేదిక రూపొందించి రెండు రోజుల్లో సమర్పించాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం రోడ్డు భద్రత కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో పోలీసు, రోడ్లు భవనాల శాఖలు సంయుక్తంగా తరచూ ప్రమాదాలు జరిగే 48 బ్లాక్ స్పాట్లను గుర్తించామని రోడ్డుభద్రత కమిటీ కన్వీనర్, రోడ్లు భవనాల శాఖ ఎస్ఇ కాంతిమతి తెలిపారు. ఈ ప్రాంతాల్లో రోడ్లలో వున్న లోపాలను గుర్తించి మళ్లీ ప్రమాదాలు సంభవించకుండా చేపట్టాల్సిన చర్యలు, అక్కడ రోడ్లలో చేపట్టాల్సిన సాంకేతిక మార్పులపై కార్యాచరణ రూపొందించాలన్నారు. జాతీయ రహదారులపై రేడియంతో స్టిక్కరింగ్ చేయకపోవడం వల్ల రాత్రివేళల్లో ప్రమాదాలకు కారణమవుతున్నా యని పోలీసు శాఖ అధికారులు వివరించారు. స్పీడ్ బ్రేకర్లు వేసిన చోట్ల రేడియంతో గుర్తులు వేయకపోవడం వల్ల రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారు వాటిని గుర్తించలేక ప్రమాదాలకు లోనవుతు న్నారని, దీనిని సరిచేయాలని రోడ్డు భద్రత కమిటీ సభ్యులు మజ్జి అప్పారావు కోరారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా కార్యాచరణ నివేదికలు అందజేయని ప్రభుత్వ శాఖలకు ఛార్జిమెమోలు జారీ చేయాలని ఇన్ఛార్జి కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఉపరవాణా కమిషనర్ మణికుమార్, రోడ్లు భవనాలశాఖ ఇఇ జేమ్స్, డిపిఒ వెంకటేశ్వర రావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ పద్మశ్రీరాణి, జిల్లా ప్రజారవాణా అధికారి నారాయణ, పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.
అగ్రిగోల్డు ఆస్తుల సమగ్ర సర్వే
జిల్లాలో అగ్రిగోల్డుకు సంబంధించిన ఆస్తులను సమగ్రంగా సర్వేచేసి పూర్తి వివరాలను అందజేయాలని ఇన్ఛార్జి కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ ఆదేశించారు. జిల్లా స్థాయి కమిటీ సమావేశం ఇన్ఛార్జి కలెక్టర్ ఛాంబర్లో జరిగింది. జిల్లాలోని నాలుగు మండలాల్లో ఉన్న అగ్రిగోల్డు ఆస్తులు, వాటి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అగ్రిగోల్డు ఆస్తుల సర్వేను పూర్తిచేసి, వాటి వాస్తవ విలువను లెక్కించాలని ఇన్ఛార్జి కలెక్టర్ సూచించారు. సమావేశంలో సిఐడి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్పోలీస్ ఎం.ఎన్. భూపాల్, విజయనగరం, బొబ్బిలి ఆర్డిఒలు డి.కీర్తి, రామ్మోహన్,తాహశీల్దార్లు పాల్గొన్నారు.
చిత్తడి నేలలను పరిరక్షించాలి
పర్యావరణ పరిరక్షణ కోసం జిల్లాలో చెరువులు, కాలువలు తదితర జలావాసాలు, చిత్తడి నేలల పరిరక్షణకు కృషి చేయాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ కోరారు. .జిల్లా చిత్తడి నేలల కమిటీ సమావేశం కలెక్టరేట్లో జరిగింది. జిల్లాలో ఉపగ్రహ చిత్రాల ఆధారంగా 2,263 చిత్తడి నేలలను గుర్తించి, అటవీశాఖ ద్వారా గ్రౌండ్ ట్రూతింగ్ కూడా పూర్తి చేశారని చెప్పారు. చినపతివాడ, చింతపల్లి గ్రామాల్లో గుర్తించిన రెండు సహజ కాలువలను చిత్తడి నేలలుగా గుర్తించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. జిల్లా అటవీ శాఖాధికారి కొండలరావు, సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.