కోడిపందేలు, పేకాట ఆడితే చర్యలు తప్పవు!

Jan 10,2025 16:12 #CI

ప్రజాశక్తి – వేంపల్లె : మండల వ్యాప్తంగా ఎక్కడైనా కోడిపందేలు, పేకాట ఆడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని సిఐ సురేష్ రెడ్డి హెచ్చరించారు. సంక్రాంతి పండుగ రోజులలో సాంప్రదాయ క్రీడలు పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. కోడిపందేలు, పేకాట నిర్వహుకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జూద క్రీడలు కాకుండా సాంప్రదాయ ఆటలు ఆడుకోవాలని సిఐ సూచించారు. కోడీ పందేలు, పేకాట, గుండాట ఇలా ఏ జూద వ్యసనమైనా ప్రజల జీవితాలను నాశనం చేస్తుందన్నారు. అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనే వారిని ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించబోమన్నారు. కోడి పందేల జూదరులు, పేకాట నిర్వహకులపై
ఇప్పటికే నిఘా పెట్టినట్లు చెప్పారు. కోడి పందేలు, జూదాల వల్ల ప్రజలు సులభంగా డబ్బులు సంపాదించాలని ఆశ పడి పందేలు కాసి డబ్బును నష్టపోతున్నారన్నారు.
దీనివలన వారి కుటుంబాలలో పండగ పూట కుటుంబం ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎవరైనా మండలంలో కోడి పందేలు నిర్వహించినా,పందేలు నిర్వహణకు స్థలాలు, భూములు ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొందరు యువకులు జూదాలకు బానిసలై కేసుల్లో ఇరుక్కుపోయి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నట్లు చెప్పారు. యువత ఇటువంటి కేసులలో ఉంటే వారి యొక్క భవిష్యత్తు అంధకారం అవుతుందని, ఇతర దేశాలలో ఉద్యోగాల కొరకు వెళ్లే వారికి, ప్రభుత్వ ఉద్యోగాలు పొందే సమయంలో, పాస్ పోర్టు పొందే సమయాలలో ఈ కేసులు అడ్డంకిగా మారి యువత యొక్క జీవితాలు అధోగతి పాలవుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మండలంలో ఎక్కడైనా కోడిపందేలు ఆడినా, జూదం ఆడినా సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని కోరారు.

➡️