- సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సహారా ఏజెంట్లుకు డిపాజిట్ దారులకు, బాధితులకు తక్షణం డిపాజిట్లు చెల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు పి.శంకరరావు, కె.సురేష్, తమ్మినేని సూర్యనారాయణలు డిమాండ్ చేశారు. సోమవారం విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఏజెంట్లు, ఖాతాదారులుతో కలిసి ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. 2009-2010 సంవత్సరాల మధ్యలో మొదలైన సహారా రియల్ ఎస్టేట్ కార్పోరేషన్, హౌసింగ్ కార్పోరేషన్ బాండ్లకు వ్యతిరేకంగా అక్రమ వసూళ్ళు చేశారంటూ సెబి పేర్కొనడం జరిగిందన్నారు. సుప్రీం కోర్టు 2012లో 15% వడ్డీతో సహా ఖాతాదారులకు తిరిగి చెల్లింపులు చేయమని ఆదేశాలు జారీ చేసిందని.. కానీ సహారా ఇండియా కంపెనీ ఖాతాదారులకు, ఏజెంట్లకు, సుప్రీం కోర్టుకు ప్రభుత్వాలకు తెలియకుండా సహారా కంపెనీ క్యూ షాప్ బాండ్లుగా మార్చివేసి డబ్బులు ఇచ్చేశామాని సుప్రీం కోర్టుకు పచ్చి అబద్దాలు చెప్పిందన్నారు. సుప్రీం కోర్టు, సెబి ఈ మాటలు నమ్మకుండా సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయన్ను అరెస్ట్ చేసి జైలులో పెట్టిందన్నారు. అతని తల్లి మరణంతో పెరోల్పై బయటకు వచ్చిన రారు సహారా మోసాలు, దుర్మార్గాలు, దురాగతాలు, అసత్యాలు యధేశ్చగా అమలుచేయడం మొదలుపెట్టారన్నారు.
2018లో క్యూ షాప్ బాండ్స్ డబ్బులు ఇస్తామని చెప్పి మళ్లీ వాటిని సహారా క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ అని, స్టార్స్ మల్టీపర్పస్ కో-ఆపరేటివ్ సొసైటీలలో ఆ సొమ్మును మళ్ళించడం జరిగిందన్నారు. సి ఆర్ సి ఎస్ అనే పోర్టల్ ద్వారా దేశం మొత్తం ప్రతీ ఖాతాదారుడుకి చెల్లింపులు చేస్తామని పత్రిక, ఎలక్ట్రాన్ మీడియా ముఖంగా కేంద్ర హౌం మంత్రివర్యులు అమిత్ షా గారు (18, జూలై 2023) చెప్పడం జరిగిందన్నారు. నేటికి సంపపర కాలం గడిచినా ఇంతవరకు దేశం మొత్తంపైన 5% (రూ.10,000) కూడా ఖాతాదారులకు చెల్లింపులు జరుగలేదన్నారు. కారణం ఏమని సి ఆర్ సి ఎస్ ద్వారా తెలుసుకుంటే సహారా కంపెనీ సరైనటువంటి ఖాతాదారుల ఆధారాలు సి అర్ సి ఎస్ కు ఇవ్వకపోవడం. సహారా సంస్థ చేసిన తప్పులకి ఖాతాదారులు మరియు ఏజెంట్లు బలి అయ్యారన్నారు. సహారా సంస్థ చేసిన మోసాలని సరిచేస్తూ, మా దగ్గర ఉన్న బాండ్లను సరియైనవి. మీరు జోక్యం చేసుకొని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం ద్వారా మా ఖాతాదారుల యొక్క బ్యాంకు ఖాతాలలో మొత్తం సొమ్ములు జమచేసి మాకు న్యాయం చేయాలని లేని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో దాసు, సూరిబాబు, ఎస్ఏ ఖాన్, టి.శ్రీనివాసరావు, ఎస్ ఎం నాయుడు, సిమ్మ అప్పారావు,వి కుమార్,సాయి, ఏజెంట్లు ఖాతాదారులు పాల్గొన్నారు.