ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మెంటాడ మండలంలోని గిరిజన గ్రామాలలో మంచినీటి సౌకర్యం కల్పించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి పి రమణమ్మ, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి టి.సోములు డిమాండ్ చేశారు. సోమవారం రెండు సంఘాల ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి నేతలు మాట్లాడుతూ … మెంటాడ మండలంలోని ఆండ్ర, లోతు గెడ్డ గ్రామాల్లో గిరిజనులు నివాసం ఉన్న చోట మంచినీటి కొళాయిలు లేని కారణంగా వేసవికాలం వచ్చిందంటే నీటికోసం చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే కూనేరు పంచాయితీలోని ఎగువగుడ్డివలస, దిగువగుడ్డివలస గ్రామాల్లోను, కొండలింగాల వలస పంచాయితీలో శీరవలస, సరవిళ్ళి గ్రామాల్లోను, ఆగూరు పంచాయితిలో సంఘంగుడ్డివలస, క్రిందగూడెం గ్రామాల్లోను ఆండ్ర పంచాయితీ వేపగుంట వలస, కుంబివలస, కొండ జీరికి వలస గ్రామాల్లోను మంచినీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. గిరిజనులు ఎక్కడో కొండ పైన ఊటనీరు, గెడ్డనీరు తాగుతున్నారు. దీని కారణంగా అనారోగ్యాలకు లోనవుతున్నారన్నారు. వేసవి వచ్చిందంటే ఊటనీరు, గెడ్డనీరు కూడా దొరకని పరిస్థితి, కాబట్టి ఈ గిరిజన గ్రామాల్లో మంచినీటి ట్యాంకులు, కొళాయిలు నిర్మించి మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. అదే విధంగా గిరిజన గ్రామాలు కు రోడ్లు వేసి రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా లో వి.రాములు, హరికృష్ణ, వి.లక్ష్మి,రామారావు, బలరాం, గిరిజనులు పాల్గొన్నారు.
మెంటాడ గిరిజన గ్రామాల్లో మంచినీటి సమస్య పరిష్కారం చేయాలి : ఐద్వా, ఆదివాసీ గిరిజన సంఘాలు
