తీరప్రాంతంలో భద్రత కట్టుదిట్టం
డ్రోన్లు, బాంబు, డాగ్ స్వ్కాడ్తో తనిఖీలు ముమ్మరం
ప్రజాశక్తి-పూసపాటిరేగ, భోగాపురం : భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు జిల్లాలో ముఖ్యమైన ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. డ్రోన్స్, బాంబ్, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు ముమ్మరం చేశారు. ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అప్రమత్తమైనట్లుగా ఎస్పి వకుల్ జిందల్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లాలోని కోరుకొండ సైనిక్ స్కూలు, చింతపల్లి లైట్హౌస్, తీర ప్రాంతంలోని గ్రామాల్లోను మెరైన్ పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్తంగా గురువారం తనిఖీలు చేపట్టి, తీరప్రాంత గ్రామస్థులను అప్రమత్తం చేసామన్నారు. అంతేకాకుండా, కోరుకొండ సైనిక్ స్కూలు, అధికార భవనాలు, చింతపల్లి లైట్ హౌస్ తోపాటు, ఇతర తీరప్రాంత గ్రామాలైన తిప్పలవలస, ముక్కాం, నీలగెడ్డపేట, పాద్దూరు, చేపల కంచేరులో డ్రోన్స్, డాగ్స్, బాంబు స్క్వాడ్స్ తనిఖీలు చేపట్టారు. సముద్రంలో చేపల వేటపై నిషేదం ఉన్నందున మత్స్యకారులను వేటకు వెళ్ళవద్దని, తీర ప్రాంతంలో ఇతర ప్రాంతాల నుండి వచ్చే షిప్పులు, అనుమానస్పద వ్యక్తులు ఎదురుపడితే సమాచారాన్ని మెరైన్ లేదా స్థానిక పోలీసులకు అందించాలని సూచించారు. యుద్ధ ప్రభావం తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమై, మెరైన్ పోలీసుల సహకారంతో పటిష్టమైన భద్రత చర్యలుచేపట్టడంతోపాటు, తీరప్రాంతంలో నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పి తెలిపారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో భోగాపురం సిఐ కె.దుర్గా ప్రసాద్, మెరైన్ సిఐ బి.వి.జె.రాజు, భోగాపురం రూరల్ సిఐ జి.రామకృష్ణ, విజయనగరం రూరల్ సిఐ బి.లక్ష్మణరావు, పలువురు ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది, మెరైన్ పోలీసులు, డాగ్, బాంబ్ స్క్వాడ్స్, డ్రోన్స్ సిబ్బంది పాల్గొన్నారు.