ప్రజాశక్తి -అరకులోయ రూరల్:అల్లూరి జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలో ఆదివాసి గిరిజన స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని మండలంలోని లోతేరు పంచాయతీ కిక్కిటిగుడ నిరుద్యోగ యువత శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పాడేరు ఐటీడీఏ పరిధిలో ఆదివాసీ డిఎస్సీ అభ్యర్థులు వేల సంఖ్యలో ఉన్నారని, శిక్షణ కేంద్రాలకు లక్షలాది రూపాయలు ఖర్చు చేశామన్నారు. పాడేరు ఐటీడీఏ పరిధిలో గిరిజన సంక్షేమ శాఖ, మండల పరిషత్ పాఠశాలల్లో 800 పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని ఆదివాసి స్పెషల్ డిఎస్సి ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీతో గిరిజన నిరుద్యోగులకు ఉపయోగం లేదని వారు మండిపడ్డారు. పోస్టులు లేని డిఎస్సి ఎవరికి కోసమని ప్రశ్నించారు. లోతేరు పంచాయతీలో కిక్కిటిగుడ గ్రామంలో అనేక మంది బిఈడి, డైట్ చదివిన గిరిజన నిరుద్యోగులు పశువులను కాసుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో తాంగుల అర్జున్, కృష్ణ, గుబారు త్రినాధ్, భాస్కర్, రవి, బిస్నాద్, గణేష్, కనకరాజు, సత్య రావు, అప్పలస్వామి, తదితరులు పాల్గొన్నారు.
