ప్రజాశక్తి-పాడేరు:ప్రధాన మంత్రి జన జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పిఎం జన్మన్) పథకం ఫలాలను పివిటిజి గిరిజనులకు అందించాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని ఐటిడిఏ పిఓ వి.అభిషేక్ స్పష్టం చేసారు. శుక్రవారం స్పందన అనంతరం ఐటిడిఏ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో పిఎం జన్ మన్ పథకం అమలుపై సమావేశం నిర్వహించారు. పి.ఎం. జన్మన్ పథకంపై అధికారులకు అవగాహన కల్పించారు. పివిటిజి గ్రామాలలో కనీస మౌలిక సదుపాయాలు, తాగునీటి సౌకర్యాలు, విద్యుత్తు, వైద్య సేవలు, టెలికం సేవలు, విద్యా సదుపాయాలు, పోషకాహారం వంటి వసతులు సమకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందన్నారు. అర్హత కలిగిన పివిటిజిలకు ఆయుష్మాన్ భారత్ కార్డులు, పక్కా గృహాలు, జన్ ధన్ బ్యాంకు ఖాతాలు, ప్రతీ కుటుంబానికి పూర్తి స్థాయిలో ఆధార్ కార్డులు, ఎస్టీ కుల దృవీకరణ పత్రాలు, అటవీ హక్కు పత్రాలు మంజూరు చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ పి.ధాత్రి రెడ్డి, డిఅర్ఓ .వివి రమణ, ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి ఎం.వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.