ప్రజాశక్తి-అరకులోయ రూరల్:అంగ న్వాడీ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిం చాలని ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. అరుకులోయ మండల కేంద్రంలోని ఓ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా బుధవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, అంగన్వాడీలకు కనీస 26వేలు వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలన్నారు. మినీ సెంటర్లను మెయిన్ సెంట్రల్గా మారుస్తూ జీవో ఇవ్వాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 2019 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడిలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.సర్వీస్లో ఉండి చనిపోయిన వారికి దహన సంస్కరణ ఖర్చులకు రూ.20వేలు ఇచ్చి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలు చేసిన సుదీర్ఘ పోరాటానికి నేటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగటంతో అంగన్వాడి కేంద్రాల్లో వంట ఇతర అవసరాలకు అయ్యే ఖర్చు పెరిగిందని చెప్పారు. గతంలో 42 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా చారిత్రాత్మకమైన పోరాటం చేపట్టారని, డిమాండ్లను పరిష్కరిస్తామని మినిట్స్ కాపీ ఆధారంగా హామీ ఇచ్చారని తెలిపారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మినిట్స్ కాపీ హామీలు అమలు చేయాలని కోరుతూ అనేక దఫాలుగా మంత్రులను, ముఖ్యమంత్రికి విన్నవించుకున్నామని, నేటికీ ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని మండిపడ్డారు.పెండింగ్లో ఉన్న అంగన్వాడి సెంటర్ బిల్లులు, టిఎ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, రానున్న బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ సమస్యలపై చర్చించాలని,అంగన్వాడీల జీతాలు పెంచాలి, హెల్పర్ల ప్రమోషన్లలో రాజకీయ జోక్యం అరికట్టాలని, సంక్షేమ పథకాలు, గ్రాడ్యుటి అమలు చేయాలని డిమాండ్ చేశారు.కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 20న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను అంగన్వాడి కార్యకర్తలు ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్, వెల్ఫేర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షీభారాణి, రాష్ట్ర కార్యదర్శి రేఖ ఎలిజిబెత్, అల్లూరి జిల్లా ప్రధాన కార్యదర్శి భాగ్యలక్ష్మి, అల్లూరి జిల్లా అధ్యక్షులు నాగమ్మ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ బి పోతురాజు, సంఘం నాయకులు పాల్గొన్నారు.
