ప్రజాశక్తి-డంబ్రిగుడ: జిల్లాలో రూ.9.80 కోట్ల వ్యయంతో ఐదు ఎకరాల్లో 36 యూనిట్లతో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సులు నిర్మిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్ చెప్పారు. బుధవారం మండలంలోని అరకు సంతబయలు వద్ద ఐదు ఎకరాల్లో నిర్మిస్తున్న ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, ఎఫ్ఎస్సిలు ఏర్పాటుతో గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయన్నారు. ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లో అరకు బ్రాండ్ పేరున కాఫీ, మిరియాలు, పసుపు, చిరుధ్యాన్యాలు, ఇతర గిరిజన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ఎం ఎస్ ఎం ఇలను ప్రోత్సహిస్తామన్నారు. రూ 500 కోట్లతో పరిశ్రమల పార్కులు ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తున్నామన్నారు. ఆర్టీసి చైర్మన్ దొన్నుదొర మాట్లాడుతూ, కుటీర పరిశ్రమల ఏర్పాటుతో గిరిజన యువతకు ఆర్థిక పురోగతికి దోహద పడతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నియోజక వర్గంలో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తోందన్నారు. గిరిజన యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తోందన్నారు. రానున్న రోజుల్లో అరకు వ్యాలీ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకు సర్పంచ్ శారదా సాగర్, స్థానిక నేతలు సుబ్బారావు, ఎంపిడి ఓ ప్రేమసాగర్, ఎపిఐఐసి అధికారులు పాల్గొన్నారు.
