ప్రజాశక్తి -అనంతగిరి:మండలంలోని నాన్ షెడ్యూల్ గుమ్మ కోట, గరుగుబిల్లి, భీంపొలు, ఎన్ ఆర్ పురం పంచాయతీలలో సాగులో ఉన్న గిరిజన రైతుల భూములు అన్యక్రాంతం కాపాడాలని మండల సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు, సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఆదివారం గుమ్మకోట పంచాయతీ పరిధి గుజ్జల్లి చుట్టు పక్కల గ్రామాలలో సిపిఎం నాయకులు ఎస్ నాగులు, జెష్ఠ. వెంకటరమణ సందర్శించారు. గిరిజన ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు గిరిజనులు మాట్లాడుతూ, తమ సాగు భూములు మైదాన ప్రాంతాలకు చెందిన భూ స్వాములు అక్రమంగా దోచుకుంటున్నారని, రక్షణ కల్పించాలని గిరిజనులు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు గిరిజనులు పాల్గొన్నారు అరకులోయ రూరల్:సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రజా చైతన్య యాత్ర లో భాగంగా ఆదివారం మండలంలోని బస్కి పంచాయితీ మొర్రిగుడలో సిపిఎం మండల కార్యదర్శి కె రామారావు, మాజీ ఎంపీటీసీ బి దశరథ్ పర్యటించారు. గిరిజనులతో మాట్లాడుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మండలం బస్కి పంచాయితీ మరి మొర్రిగూడ గ్రామానికి చెందిన గిరిజనులు భూమి పట్టాల్లో డుంబ్రిగుడ మండలం పేర్లు ఉన్నాయని, నేటి వరకు అరకువేలి మండలం పేరు మారలేదని తెలిపారు. దీంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై అనేకసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమస్యను తీసుకెళ్లినా పరిష్కరించ లేదన్నారు. తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పట్టా మార్పులు, చేర్పులు చేయాలని డిమాండ్ చేశారు.గ్రామంలో తాగునీరు సమస్య తీవ్రంగా ఉందన్నారు.మెర్రిగుడ గ్రామంలో సిసి రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీలు ఎక్కడికక్కడే నిలిచిపోయి దుర్వాసన వెదజల్లుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తాంగుల మొంగ్లు అప్పన,తదితరులు పాల్గొన్నారు. అరకులోయ రూరల్:పీఎం జన్మన్ పథకంలో కేంద్ర ప్రభుత్వం పీవిటీజిలకు మంజూరు చేసిన ఇల్లులకు 10 లక్షల రూపాయలు పెంచి ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు.ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ప్రజా చైతన్య యాత్ర లో భాగంగా ఆదివారం మండలంలో సిరగం పంచాయతీ పివిటీజీ గ్రామాలైన సంధివలస లో పర్యటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఏ మూలకు సరిపోవని, సిమెంటు, ఐరన్ ఇతర గృహ సామగ్రి ధరలు పెరిగిపోయాయన్నారు. పది లక్షలు ఇస్తేనే పూర్తిస్థాయిలో ఇల్లు నిర్మించుకోవచ్చని తెలిపారు. గ్రామాల్లో రోడ్లు, మంచినీరు సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. ఈనెల 24వ తేదీన జరిగే ధర్నాకి గిరిజనులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఐసుబాబు, పాంగి నాగేష్, మురళి, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
