ప్రజాశక్తి-అనంతగిరి:మండలంలోని విద్యా వ్యవస్థ దిగజారుతోందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో పూర్తిగా విఫలమవుతున్నారని, ప్రజాప్రతినిధులు ప్రోటోకాల్ పాటించ లేదని జెడ్పిటిసి, ఎంపీపీలు అగ్రహం వ్యక్తం చేశారు.స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ శెట్టి నీలవేణి అధ్యక్షతన మండల సభ్య సమావేశం గురువారం వాడివేడిగా జరిగింది. ఈ సమావేంలో హాజరైన ఎంపిటిసి, సర్పంచ్లు మాట్లాడుతూ, ప్రాథమిక, ఆశ్రమోత పాఠశాలలో విద్యా వ్యవస్థ దారుణంగా ఉందని నిలదీశారు. పాఠశాలలకు టీచర్లు సమయానికి హాజరు కాలేదని, కొన్ని పాఠశాలలు వాలంటీర్లతో కొనసాగుతున్నాయన్నారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ, ప్రముఖ పర్యాటక కేంద్రమైన అనంతగిరి, అరకు ప్రాంతాలకు అదనపు బస్సు సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ అధికారులను కోరారు. జడ్పిటిసి గంగరాజు మాట్లాడుతూ, గుమ్మకోట నుండి పాడేరు, దేవరాపల్లి నుండి పాడేరుకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని తెలిపారు. మండల కేంద్రంలో అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచాలన్నారు. సభకు హాజరు కాని విన్నకోట, భీమవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని సభ తీర్మానం చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీవో నగేష్, డిప్యూటీ తహసిల్దార్ మాణిక్యం, ఎంఈఓ బాలాజీ, ఏటిడబ్ల్యు వెంకటరమణ, ఏవో ఉమామహేశ్వరి, వైస్ ఎంపీపీలు జయవర్ధని, శకుంతల, ఎంపీటీసీలు తటినాయడు, అశోక్, సర్పంచ్ సన్యాసిరావు, రూతు అప్పారావు, రాములమ్మ పాల్గొన్నారు
