గెడ్డ పోరంబోకు స్థలంలో అక్రమ నిర్మాణాన్ని ఆపాలి

Apr 27,2025 00:03
అక్రమ నిర్మాణ పనులు చూపుతున్న సిపిఎం నేతలు

ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌:మండల కేంద్రంలోని ట్రైబల్‌ కాటేజీ పక్కన గెడ్డ పోరంబోకు స్థలంలో పాంగి చిన్నారావు గిరిజనేతరులకు అండగా ఉండి నిర్మిస్తున్న భారీ అక్రమ నిర్మాణాలు నిలుపుదల చేయాలని సిపిఎం నేతలు డిమాండ్‌ చేశారు. శుక్రవారం అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్న స్థలంలో సిపిఎం మండల కార్యదర్శి కిండంగి రామారావు, మండల నాయకులు కిల్లో జగన్నాధం, కొర్రా మగ్గన్న, కిల్లో సహదేవ్‌, పాంగి రామన్న పర్యటించి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ, అరకులోయ మండలం పెదలబుడు పంచాయతీ కంఠబౌన్సుగుడ పరిధిలో సర్వే నెంబర్‌ 26 బిలో విద్యుత్‌ పవర్‌ లైన్‌ 33 కెవి తీగలు ఉన్నాయని, దీనిని ఆనుకొని ఉన్న గెడ్డ పోరంబోకు ఖాళీ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి అడ్డదారిలో చట్ట విరుద్ధంగా భారీ భవన నిర్మాణాన్ని చేపడుతున్నారన్నారు. ఈ గెడ్డ పోరంబోకు స్థలంలో పాంగి చిన్నారావు, మాజీ సర్పంచ్‌ బినామిగా ఉండి నిర్మాణం చేపడుతున్నారన్నారు. కోట్లాది రూపాయలతో పెట్టుబడి చేసి నిర్మిస్తున్నారని, దీని వెనకాల గిరిజనేతురుల హస్తం ఉన్నట్టు తెలిసిందన్నారు. ఈ గెడ్డ పోరంబోకు స్థలంలో వ్యాపార సముదాయాలు నిర్మించి వ్యాపారం చేసుకోవడం చట్ట విరుద్ధమన్నారు. గెడ్డ పోరంబోకు స్థలంలో కోట్లాది రూపాయలతో బినామీ పేరుతో గిరిజనేతరులు రిసార్ట్స్‌ భవన నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు ఇచ్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణమే గెడ్డ పోరంబోకు స్థలంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలు నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

➡️