గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలి

మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

ప్రజాశక్తి-పాడేరు: గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఎ. ఎన్‌. దినేష్‌ కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 26వ తేదీన స్థానిక తలారిసింగి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో గణతంత్ర దినోత్సవం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై శకటాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. అదేవిధంగా ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల వారసులను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించాలని సూచించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు , తరువాత మైదాన్ని పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. అంతరాయం లేని విద్యుత్తు సరఫరా చేయాలని ట్రాన్స్కో అధికారులకు సూచించారు.ఈ సమావేశం లో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జె. అభిషేక్‌ గౌడ్‌, ఐటిడిఏ పి.ఓ. వి.అభిషేక్‌, సబ్‌ కలెక్టర్‌ సౌర్యమన్‌ పటేల్‌, డి.ఆర్‌.ఓ. కె. పద్మలత, డి.ఆర్‌.డి.ఏ. పి.డి. వి.మురళి, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌.బి. ఎన్‌.నంద్‌, జిల్లా ఉద్యానవన అధికారి ఎ.రమేష్‌ కుమార్‌రావు, పశు సంవర్ధక శాఖ డి.డి. నరసింహులు, జిల్లా సెరీ కల్చర్‌ అధికారి అప్పారావు, గిరిజన సంక్షేమ శాఖ ఇ ఇ జి. డేవిడ్‌ రాజ్‌ తదితరులు పాల్గొన్నారు. పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలు పాడేరు: ముంచంగిపుట్టు మండలం సుజనకోట గ్రామం వద్ద మాచ్‌ ఖండ్‌ బ్యాక్‌ వాటర్‌ వద్ద పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ ఎ. ఎస్‌. దినేష్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. గురువారం పర్యాటక అభివృద్ధి, చలి అరకు ఉత్సవం 25 పై కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బుధవారం సుజన కోట పంచాయతీలో పర్యటించానని మాచ్‌ ఖండ్‌ రిజర్వాయర్‌ కేజ్‌ కల్చర్‌, ప్యారా సైలింగ్‌, పర్యాటక అభివృద్ధికి అనుకూలంగా ఉందన్నారు. రిజర్వాయరు పరివాహక ప్రాంతంలో 350 మంది వరకు మత్స్యకారులు ఉన్నారన్నారు. మత్స్యకారులతో సొసైటీ ఏర్పాటు చేయాలని సూచించారు. కేజ్‌ కల్చర్‌ ఏర్పాటుకు బ్యాంకుల నుండి రుణాలు ఏర్పాటు చేస్తామన్నారు. రూ.5 లక్షల పెట్టుబడితో కేజ్‌ కల్చర్‌ ఏర్పాటు చేస్తే మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి దోహద పడుతుందన్నారు. గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కేజ్‌ కల్చర్‌ ఉపయోగంగా ఉంటుందని అన్నారు.గిరిజన ఆచార సాంప్రదాయాలు ప్రతిబింబించేలా చలి అరకు ఉత్సవం నిర్వహించాలని చెప్పారు. అరకు పట్టణంలో విద్యుత్తు దీపాలు అన్ని వెలిగే విధంగా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జె. అభిషేక్‌ గౌడ్‌, ఐటిడిఏ, పి.ఓ. వి.అభిషేక్‌ సబ్‌ కలెక్టర్‌ సౌర్యమన్‌ పటేల్‌, మ్యూజియం మేనేజర్‌ మురళి, పర్యాటక శాఖ అధికారులు ఎంపిడిఓలు తదితరులు పాల్గొన్నారు.

➡️