ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:మండలంలోని బాబుసాల గ్రామ పంచాయతీ బళ్ళుగూడ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులను సిపిఎం మండల కార్యదర్శి కొర్ర త్రినాథ్ గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా త్రినాధ్ మాట్లాడుతూ, బల్లుగూడ గ్రామంలో గత వారం రోజులుగా ముగ్గురు చిన్నారులకు దగ్గు, జలుబు, జ్వరం తో పాటు శరీరంలో చిన్న చిన్న కురుపులతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పత్రికల్లో కథనాలు వచ్చినప్పటికీ తూతూ మంత్రంగా వైద్య శాఖ సిబ్బంది వైద్య సేవలు అందించారని ఆగ్రహించారు. ముంచంగిపుట్టు, పాడేరు జిల్లా ఆసుపత్రిలో 14 మంది చిన్నారులు వైద్యం పొందుతున్నారన్నారు.గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత రెండు ఏళ్లుగా మంచి నీటి కోసం అమర్చిన సోలార్ ప్లాంట్ మరమ్మతులకు గురైనప్పటికి అధికారులు స్పందించలేదన్నారు.ఇంటింటికి కుళాయి నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో సుమారు 57 మంది విద్యార్దులు ఉన్నా ప్రభుత్వ ఉపాధ్యాయుడే లేడని, ఒక మాతృ భాష వాలంటీర్ తో విద్యా భోధన జరుగుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు ఎంఎం శ్రీను, కె.నర్సయ్య, పి.దళపతి, దేవన, గ్రామస్థులు చిరంజీవి, సాంబ, కే శ్రీను, కామేష్, రమేష్ పాల్గొన్నారు.
