ప్రజాశక్తి-అరకులోయరూరల్:అంగన్వాడీలపై పని భారం తగ్గించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉమామహేశ్వరరావు మాట్లాడారు. అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని 42 రోజులు సమ్మె చారిత్రాత్మకమైందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం గడుస్తున్నా అంగన్వాడీలకు ఇచ్చిన హామీని అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యిందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్ను నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తున్నారన్నారు. మరోపక్క అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంగన్వాడి వ్యవస్థతో శిశు మరణాలు తగ్గుతున్నాయని, గర్భిణీలు ఆరోగ్యంగా ఉంటున్నారని ఇలాంటి వ్యవస్థను సంస్థ బలోపేతం చేసి అంగన్వాడి ఉద్యోగులందరికీ భద్రత చర్యలు చేపట్టాలని చెబుతుంటే మరోవైపు పాలకులు ఆ వ్యవస్థను ఏ రకంగా నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈనెల 20న దేశవ్యాప్తంగా నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున అంగన్వాడీ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాలుగు లేబర్ కోడ్స్ అమలు జరిగితే కార్మికులు బానిస బతుకులు అవుతాయని తెలిపారు. ఎన్డీఏ కూటమి పెట్టుబడిదారులకి, కార్పొరేట్లకి లాభాలు చేకూర్చేందుకే కార్మికులకు నష్టదాయకమైన నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేయాలని ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రేఖ, జిల్లా అధ్యక్షులు కార్యదర్శి కె భాగ్యలక్ష్మి, డి నాగమ్మ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జాన్ని భగత్ రాం, జిల్లా సహాయ కార్యదర్శి యస్ బి పోతురాజు, అరకు ప్రాజెక్ట్ నాయకులు లక్ష్మి, సంగీత, తదితరులు పాల్గొన్నారు
