పోటెత్తిన భక్తులు..
ఆకట్టుకున్న బళ్ల వేషాలు
ఆలయానికి క్యూ కట్టిన సందర్శకులు
ప్రజాశక్తి-బొబ్బిలి : గొల్లపల్లి దాడితల్లి సిరిమానోత్సవం అంబరాన్ని తాకింది. గొల్లపల్లి గ్రామదేవత పండగ సందర్భంగా మంగళవారం సిరిమానోత్సవం ఘనంగా జరిగింది. సిరిమానోత్సవం సాయంత్రం 4.30గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ మూడు గంటల ఆలస్యంగా 7.30గంటలకు ప్రారంభమైంది. సిరిమానును పూజారి బత్తిన కృష్ణ అధిరోహించారు. గొల్లపల్లిలో ప్రారంభమైన సిరిమానోత్సవం దాడితల్లి ఆలయం, ఓంకార్ టాకీస్, మేదరబంద, తాండ్రపాపరాయ జంక్షన్, కోట జంక్షన్, చర్చి సెంటర్, జెండమాల్ జంక్షన్, శ్రీవేణుగోపాల ఆలయం జంక్షన్, వాటర్ ట్యాంక్, పెట్రోల్ బాంక్, రైల్వే జంక్షన్, గాంధీ బొమ్మ, కృష్ణా టాకీస్, గౌడవీధి, రావువారివీధి, గొల్లవీధి, కుమ్మరివీధి, మార్కెట్ నాలుగు రోడ్లు జంక్షన్ మీదుగా ఊరేగిన సిరిమాను తిరిగి గొల్లపల్లి చేరుకుంది. సిరిమానోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిఎస్పి భవ్యరెడ్డి, పట్టణ సిఐ కె.సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఆకట్టుకున్న బల్ల వేషాలు
దాడితల్లి సిరిమానోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బల్ల వేషాలు ఆకట్టుకున్నాయి. సిరిమానోత్సవం ముందు వినాయకుడు, దుర్గాదేవి, కాళీమాత, గజలక్ష్మి, అయోధ్యరాముడు, తదితర దేవుళ్లు వేషధారణలో కళాకారులు ఆకట్టుకున్నాయి. బల్ల వేషాలను తిలకించేందుకు భక్తులు ఆసక్తి చూపారు. ఆలయానికి క్యూ కట్టిన భక్తులు దాడితల్లి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. వనం గుడిని ఎమ్మెల్యే బేబినాయన, బుడా చైర్మన్ తెంటు రాజా, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, వైసిపి నాయకులు సిరి సహస్ర, భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎమ్మెల్యే బేబినాయన ప్రసాదం పంపిణీ చేశారు.
సిరిమానోత్సవాన్ని దర్శించుకున్న ప్రముఖులు
సిరిమానోత్సవాన్ని జిల్లా రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఎమ్మెల్యే బేబినాయన, బుడా చైర్మన్ తెంటు రాజా, మాజీ ఎమ్మెల్యే తెంటు రాజా, వైసీపీ నాయకులు సిరి సహస్ర, మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి, వివిధ శాఖాధికారులు దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు.
చలి వేంద్రాలు ఏర్పాటు
దాడితల్లి పండగకు వచ్చిన భక్తులు, ప్రజలు దాహార్తిని తీర్చేందుకు సామాజిక కార్యకర్తలు, దాతలు చలి వేంద్రాలు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీలో వాటర్ ప్యాకేట్ల నిషేధం అమలులో ఉండడంతో తాగునీరు కోసం ప్రజలు, భక్తులు ఇబ్బందులు పడకుండా మున్సిపల్ అధికారులు కూడా చలి వేంద్రాలు ఏర్పాటు చేశారు.
పారిశుధ్య కార్మికులు సేవలు భేష్
పండగ సందర్భంగా బొబ్బిలి, గొల్లపల్లిను పరిశుభ్రంగా ఉంచడంతో పారిశుధ్య కార్మికులు మంచి కషి చేశారు. ఆలయాలు వద్ద ప్రత్యేక కార్మికులను ఏర్పాటు చేసి పారిశుధ్య పనులు నిర్వహించారు. సిరిమానోత్సవం సందర్భంగా సిరిమానును మొక్కేందుకు మోక్కేందుకు విసిరిన అరటి, మామిడి పండ్లు, కొబ్బరి కాయలు, ఇతర వ్యర్దాలను ఎప్పటికప్పుడు తొలగించి రోడ్లను శుభ్రం చేశారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను ప్రజలు కొనియాడారు.