మహిళా దినోత్సవ బుక్లెట్ ఆవిష్కరిస్తున్న ఐద్వా నాయకులు
అనంతపురం కలెక్టరేట్ : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే మహిళా సాధికారత సాకారం అవుతుందని ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి.సావిత్రి తెలిపారు. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ, ఐద్వా, యుటిఎఫ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ బుక్లెట్ను సోమవారం స్థానిక గణేనాయక్ భవన్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సావిత్రి మాట్లాడుతూ మార్చి 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు జరుగుతాయన్నారు. వ్యవసాయం నుంచి అంతరిక్షం వరకు మహిళల ప్రాధాన్యత ఉందన్నారు. ఉత్పత్తి రంగంలో మహిళా సాధికారతను సాధించేందుకు అడుగులు పడుతున్నాయన్నారు. చట్టసభల్లో మహిళలకు నేటికీ సముచిత స్థానం లభించకపోవడం విచారకరం అన్నారు. రిజర్వేషన్ ప్రక్రియ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారే తప్ప మహిళలకు న్యాయం చేయాలనే ఆలోచనలు ఇప్పటివరకు పాలించిన. పాలిస్తున్న పార్టీలకు లేదన్నారు. మహిళల భాగస్వామ్యంతోనే ప్రపంచాభివద్ధి సాధ్యమవుతుందని వాస్తవాన్ని గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ ఎం.నాగమణి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు నాగభూషణ, ఏటీఎం నాగరాజు, తిరుమలేశు, యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవిందరాజులు, లింగమయ్య, సీనియర్ నాయకులు జిలాన్, జిల్లా గౌరవ అధ్యక్షులు రమణయ్య, రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు.