ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : ఆరు నెలలుగా గౌరవ వేతనాలు రావడం లేదని ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో కమిషనర్ కు విన్నవించిన నేటికీ పరిష్కారం కాలేదని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సోమవారం ప్రజా సమస్య పరిష్కార వేదికలో కార్పొరేటర్లు బాలాంజనేయులు సైపుల్లా బేగ్ కలిసి కమిషనర్ బాలస్వామికి విన్నవించారు. వెంటనే కమిషనర్ బాలస్వామి కౌన్సిల్ మీటింగ్ క్లర్క్ నారాయణస్వామికి ఫోన్ చేసి కార్పొరేటర్లు గౌరవ వేతనం అడిగే వరకు బిల్లు పెట్టరా వారితో సైతం పదేపదే చెప్పించుకోవాలా బిల్లులు తయారు చేసి పెట్టడం మన విధి మన డ్యూటీ సక్రమంగా చేస్తే బాగుంటుంది. వెంటనే బిల్లులు పెట్టండి అని ఆదేశించారు. ఆదేశాలు జారీ చేసి ఆరు రోజులు గడిచాయి తిరిగి మరో సోమవారం వస్తున్నా ఇప్పటివరకు వేతనాలు చెల్లించలేదని వారు తెలిపారు. 2024 నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెల సైతం కలుపుకుంటే ఆరు నెలలుగా కార్పొరేటర్లకు గౌరవ వేతనాలు మంజూరు కావడం లేదని అన్నారు. గౌరవ వేతనాలు విషయమై అకౌంటెంట్ ను ప్రశ్నిస్తే మీటింగ్ క్లర్కు బిల్లు పెట్టలేదని చెబుతారు మీటింగ్ క్లర్క్ ను అడిగితే బిల్లు తయారుచేసి డిసి సారుకు పెట్టానని సమాధానం ఇస్తా రు. ఆయన త్వరగా ఫైళ్లపై సంతకాలు చేయరు ఆయన సంతకాలు చేసేది ఎప్పుడు మా గౌరవ వేతనం వచ్చేది ఎప్పుడు అని కార్పొరేటర్లు నిట్టూర్పు విడుస్తున్నారు. ఎవరి మాట నిజమో ఎవరి మాట అబద్దమో తెలియని పరిస్థితి నెలకొంది కార్పొరేషన్ లో ఎవరికి ఎవరు జవాబుదారీగా లేరు అంతా చెబుతారు. పనైపోతుందంట కానీ ఏ పని జరగదు ఈ చిన్న పని జరగాలన్న పదే పదే తిరగాల్సి వస్తుందని సాక్షాత్తు కార్పొరేటర్లే పేర్కొనటం చూస్తే విస్మయం కలగక మానదు తిరిగి రేపటి రోజుల సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మరోసారి కార్పొరేటర్లకు గౌరవ వేతనాలు ఇవ్వరు అని అడగటానికి వారు సిద్ధమవుతున్నారు.
