అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోండి : సిపిఎం

తడిసిన మిర్చిని పరిశీలిస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి-ఉరవకొండ

ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతులు పలు పంటలను నష్టపోయారని, వీరిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప డిమాండ్‌ చేశారు. విడపనకల్‌ మండల పరిధిలోని గడేకల్‌, హంచనహళ్‌ గ్రామాల్లో శుక్రవారం నాడు అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల పంటలను సిపిఎం, రైతుసంఘం నాయకులు శనివారం పరిశీలించారు. సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి రంగారెడ్డి, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు పెద్దముష్టుర్‌ వెంకటేశులుతో కలిసి పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా నల్లప్ప మాట్లాడుతూ శుక్రవారం కురిసిన అకాల వర్షాలతో ఉరవకొండ నియోజకవర్గంలో మిరపపంట రైతులు నష్టపోయారన్నారు. మిరప పంట తడిసి ముద్దవ్వడంతో రైతుల కష్టం ఆవిరైందన్నారు. తడిసిన మిరపను ఆరబెట్టేందుకు కుటుంబ సభ్యులంతా కష్టపడుతున్నా సాధ్యం కాని పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికే ధరలేక నష్టాలను చవిచూస్తున్న మిరప రైతులకు అకాల వర్షం మరింత కష్టాన్ని తెచ్చిపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంట మొత్తం నాశనం అవడంతో రైతులు అప్పుల ఊభిలో కూరుకుపోయారన్నారు. బ్యాంకులు, ప్రయివేటు వ్యక్తుల వద్ద తెచ్చిన అప్పులను ఎలా తీర్చాలని రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. తక్షణం వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటించి నష్టపోయిన పంట వివరాలను సేకరించి ప్రభుత్వానికి పంపాలన్నారు. వెంటనే నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పంటలతో పాటు గడేకల్‌ గ్రామానికి చెందిన బోయ వెంకటేశులు చెందిన గాలి మిషన్‌ రేకుల షెడ్డు గాలీవానకు నేలకూలిందన్నారు. ఇలాంటి బాధితులనూ గుర్తించి వారికి పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు హంపయ్య, వరలక్ష్మి, పర్వతప్ప, భీమేష్‌ పాల్గొన్నారు.

➡️