- సైనికలాంఛనాలతో మురళీనాయక్ అంత్యక్రియలు పూర్తి
- పవన్ కల్యాణ్ సహా పలువురు ప్రముఖులు హాజరు
ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : భారత్కు పాకిస్తాన్తో జరిగిన పోరాటంలో అమరుడైన వీర సైనికుడు మురళీ నాయక్ అంత్యక్రియలు ఆదివారం అశ్రునాయనాల నడుమ పూర్తయ్యాయి. మురళీ నాయక్ భౌతికకాయానికి ఆయన స్వగ్రామమైన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాలో సైనిక లాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహించారు. వీర జవాన్ను కడసారి చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. మురళీనాయక్ వ్యవసాయ క్షేత్రం వరకు దారి పొడవునా మురళీ నాయక్ అమర్ రహే… నినాదాలు హోరెత్తాయి. అంత్యక్రియలు జరిగే ప్రాంతంలో సైనికాధికారులు గన్ సెల్యూట్తో గౌరవ వందనాన్ని అందించారు. అనంతరం జాతీయ పతకాన్ని మురళీనాయక్ తండ్రికి అందజేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనిత, అనగాని సత్య ప్రసాద్, సవితమ్మ, సత్యకుమార్ యాదవ్ తదితరులు మురళీనాయక్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.
అండగా ఉంటాం : ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
మురళీ నాయక్ కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సిఎం పవన్కల్యాణ్ హామీ ఇచ్చారు. ఐదు ఎకరాల పొలంతోపాటు, 300 గజాల ఇంటి స్థలం కేటాయిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా తాను వ్యక్తిగతంగా రూ.25 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందజేస్తానని తెలిపారు.
భౌతికకాయాన్ని మోసిన నారా లోకేశ్
వీర మరణం పొందిన మురళీ నాయక్ భౌతికకాయం ఉన్న శవ పేటికను స్వయంగా నారా లోకేశ్ మోశారు. అంతకు ముందు మురళీనాయక్ భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..మురళీనాయక్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. అదేవిధంగా ఆయన జ్ఞాపకార్థం గ్రామంలో స్మారక స్థూపం నిర్మిస్తామని తెలిపారు. గ్రామస్తుల కోరిక మేరకు కల్లితండా పేరును మురళీ నాయక్ తండాగా మారుస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున రూ.50 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని, మురళీనాయక్ తండ్రికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పారు.