మాట్లాడుతున్న వైసిపి యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ భాసిద్
ప్రజాశక్తి-గుంతకల్లు
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటమి భయంతోనే కూటమి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ తెరపైకి తెచ్చిందని వైసిపి యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్బాషిద్ అన్నారు. సోమవారం స్థానిక మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారం చేపట్టిన చంద్రబాబు తొలి సంతకం డీఎస్సీ నోటిఫికేషన్ పైనే పెట్టారన్నారు. అయితే తొలి సంతకం చేసి ఎనిమిది నెలలు అవుతున్నా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పుడు పాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున యువతను మోసం చేసేందుకు కూటమి ప్రభుత్వం 16 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటన చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం ముగిసేలోగా డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో యువజన విభాగం నాయకులు మద్దికెర ప్రతాప్, ప్రశాంత్, మనోజ్, దిలీప్, కసాపురం మధు, జాఫర్, మస్తాన్, ప్రశాంత్కుమార్, తదితరులు పాల్గొన్నారు.